సారాంశం

Monsoon: భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) రుతుప‌వ‌నాలు జూన్ 7న (బుధ‌వారం) కేర‌ళ‌ను తాకే అవ‌కాశ‌ముంద‌ని తాజా అంచ‌నాల్లో పేర్కొంది. అరేబియా సముద్రంలో గాలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అందువల్ల రుతుపవనాలు తేదీ తప్పినప్పటికీ త్వరలోనే కేరళకు వస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.  

Monsoon delayed in Kerala: భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) రుతుప‌వ‌నాలు జూన్ 7న (బుధ‌వారం) కేర‌ళ‌ను తాకే అవ‌కాశ‌ముంద‌ని తాజా అంచ‌నాల్లో పేర్కొంది. అరేబియా సముద్రంలో గాలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అందువల్ల రుతుపవనాలు తేదీ తప్పినప్పటికీ త్వరలోనే కేరళకు వస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే.. కేరళలో రుతుపవనాల రాక మూడు, నాలుగు రోజులు ఆలస్యమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ప్రకటించింది. రుతుపవనాలు జూన్ 4 నాటికి రాష్ట్రాన్ని తాకుతాయని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు జూన్ 7 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ వ‌ర్గాలు తెలిపాయి. దక్షిణ అరేబియా సముద్రంలో పశ్చిమ గాలులు పెరుగుతుండటంతో పరిస్థితులు అనుకూలంగా మారాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, పశ్చిమ గాలుల లోతు క్రమంగా పెరుగుతోందనీ, జూన్ 4న సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని తెలిపారు.

"ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయి. రాబోయే 3-4 రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి ఈ అనుకూల పరిస్థితులు మరింత మెరుగుపడతాయని మేము ఆశిస్తున్నాము" అని వాతావరణ సంస్థ తెలిపింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామనీ, అప్డేట్ చేస్తామని తెలిపింది. 2022 మే 29న, 2021 జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేర‌ళ‌లోకి ప్రవేశించాయి. కాగా, ఈ సారి కాస్త ఆల‌స్యం అవుతున్నాయి.  దేశంలోని ఇతర ప్రాంతాల్లో రుతుపవనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో వాతావరణ శాఖ ప్రకటించలేదు.