weather report : చల్లటి కబురు.. 27న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు - ఐఎండీ
మండే ఎండలతో, ఉక్కపోతలతో సతమవుతున్న అందరికీ భారత వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 27వ తేదీన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని పేర్కొంది. దీని వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మే 27వ తేదీన కేరళకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్ లో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించింది. రాబోయే 5 రోజుల్లో కొంకణ్, గోవా ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ ముంబై హెడ్ జయంత సర్కార్ తెలిపారు.
వరకట్న దురారాచారంపై సీఎం ఫైర్.. ‘పురుషుడు మరో పురుషుడిని పెళ్లాడితే...’
రాబోయే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలే అవకాశం ఉందని, మే 27 నుంచి 29 మధ్య ఉత్తర గుజరాత్ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తన రోజు వారి నివేదికలో పేర్కొంది.
నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు రానున్న 48 గంటల్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి.
25, 29 తేదీల్లో ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మే 29 వరకు అస్సాం, మేఘాలయలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో వచ్చే 5 రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో మే 29 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే, మే 25, 26 తేదీల్లో కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సీమా నువు గ్రేట్.. ఒంటి కాలుతో గెంతుతూ స్కూల్ కు వెళ్తున్న పదేళ్ల బాలిక.. ఢిల్లీ సీఎం ప్రశంసలు
వాయువ్య ప్రాంతంలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో మే 28, 29 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 28వ తేదీన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో వడగండ్ల వాన పడే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో దేశవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితి ఉండదని, ఎండవేడిమి నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని ఐఎండీ అంచనా వేసింది.