సీమా నువు గ్రేట్.. ఒంటి కాలుతో గెంతుతూ స్కూల్ కు వెళ్తున్న పదేళ్ల బాలిక.. ఢిల్లీ సీఎం ప్రశంసలు
అంగవైకల్యం కూడా ఆమె తెగువ ముందు తట్టుకోలేకపోయింది. చదువు పట్ల ఉన్న ప్రేమ ఆ వైకల్యాన్ని కూడా ఎదురించింది. బీహార్ కు చెందిన పదేళ్ల సీమా ప్రతీ రోజు కిలో మీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు ఒంటి కాలుతోనే వెళ్లి వస్తోంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆ బాలికకు పదేళ్లు. చదువంటే ఆమెకు ప్రాణం. రెండేళ్ల కిందట అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె కాలు తీసేయాల్సి వచ్చింది. దీంతో అందరూ ఆమె చదువు ఇక ఆగిపోయినట్టే అనుకున్నారు. కానీ ఆమెకు చదువు పట్ల ఉన్న ప్రేమను ఈ వైకల్యం కూడా ఆపలేకపోయింది. ఆ బాలిక ఒంటి కాలుతోనే ప్రతీ రోజూ స్కూల్ కు వెళ్తోంది. అయితే ఆమెను ప్రతీ రోజు తల్లిదండ్రులు స్కూల్ లో దించి, తీసుకువస్తారనుకుంటే పొరపాటే. కిలో మీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు ఆమె ప్రతీ రోజూ తన ఒంటి కాలుతో గెంతుకుంటూ వెళ్లి వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్ లో వైరగా మారింది.
Nationwide Protest: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. కొనసాగుతున్న దేశవ్యాప్త నిరసనలు..
సకల సౌకర్యాలు ఉన్నా.. చదువుకునేందుకు ఆసక్తి చూపని పిల్లలు మన చుట్టూ ఎంతో మంది కనిపిస్తారు. కానీ కొంత మందికి ఎలాంటి సౌకర్యాలూ లేకపోయినా గొప్పగా చదువుకుంటారు. అలాంటి వారి కోవలోనే బీహార్ లోని జమూయి జిల్లాకు చెందిన 10 ఏళ్ల సీమా కూడా వస్తుంది. ఆమెకు చదువు పట్ల ఉన్న ఆసక్తి ఇప్పుడు నెటిజన్ల మనస్సును కొల్లగొట్టింది. ఈ విషయంలో స్వయంగా ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.
సీమాకు రెండు సంవత్సరాల కిందట రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. కానీ డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. కాలు అయితే తొలగించారు గానీ ఆమెకు చదువుపట్ల ఉన్న శ్రద్దను మాత్రం పొగొట్టలేకపోయారు. ఆపరేషన్ జరిగి కొంత కాలం అయిన తరువాత ఆమెకు స్కూల్ కు వెళ్లడం ప్రారంభించింది. అయితే ఆ బాలిక ఇంటి నుంచి స్కూల్ కిలో మీటర్ దూరంలో ఉంటుంది. తల్లిదండ్రులు పేదవారే. ప్రతీ రోజు వారి జీవనం కొనసాగేందుకు పనులు చేసుకుంటారు. సీమాను స్కూల్ వద్ద దించి తిరిగి తీసుకురావడం వారికి కూడా ఇబ్బందే. అయితే సీమ ఎవరి సాయం తీసుకోకుండా తనకు ఉన్న ఒక్క కాలుతోనే స్కూల్ కు వెళ్లాలనుకుంది.
అనుకున్నట్టుగానే ప్రతీ రోజు కిలో మీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు ఒంటి కాలుతో సీమా గెంతుతూ వెళ్తోంది. అయితే ఇటీవల ఆమె స్కూల్ కు వెళ్తున్న తీరును ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి కూడా వెళ్లింది. ఆ చిన్నారి తెగువను ప్రశంసించారు. సీమా ప్రయాణాన్ని చూసిన తరువాత ఆయనకు కలిగిన గర్వాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రతీ పిల్లవాడికి మంచి విద్య అవసరం ఉందని, ప్రతి బిడ్డకు మంచి విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు పని చేయాలని ఆయన సూచించారు.
సీమా ఎంతో మంది నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఆమె ఇప్పుడు ఆ గ్రామంలో ఒక సంచలనంగా మారింది. స్కూల్ టీచర్లు కూడా ఆ బాలిక స్పూర్తిని మెచ్చుకుంటున్నారు. ఆమె తెగువను అభినందిస్తున్నారు. సీమ చదువుకునేందుకు అవసరమైన సహాయన్ని టీచర్లు అందిస్తున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం చాలా మంది నెటిజన్లకు ప్రేరణగా కలిగించింది. వికలాంగ పిల్లలకు చదువుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.