సభలోనూ మాస్కులు ధరించాలి: రాజ్యసభ చైర్మన్ జగదీప్
కరోనా కేసులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలనే సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేశాయి. తాజాగా, పార్లమెంటులోనూ మాస్కులు ధరించడంపై ప్రస్తావన వచ్చింది. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు మాస్కులు ధరించే సభకు వచ్చారు. చట్టసభ్యులూ సభలో మాస్కులు ధరించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సూచించారు.
న్యూఢిల్లీ: చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని చెప్పింది. ఆయా రాష్ట్రాలు కూడా ప్రజలకు సూచనలు చేశాయి. తాజాగా, పార్లమెంటులోనూ ఈ విషయంపై రియాక్షన్ కనిపించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్లు మాస్కులు ధరించి సభకు వచ్చారు. అంతేకాదు, సభలో చట్టసభ్యులు మాస్కులు ధరించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సూచనలు చేయడం గమనార్హం.
చైనా జీరో పాలసీని ఎత్తేయడంతో కట్టతెగిపోయినట్టుగా కేసులు ఉధృతి పెరిగిపోయింది. బీఎప్ 7 వేరియంట్ అక్కడ బీభత్సం సృష్టిస్తున్నది. దీని ప్రభావం ఇతర దేశాలపైనా పడే ప్రమాదం ఉన్నదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. టీకాలు వేసుకోవడంపై ఫోకస్ పెట్టాలని సూచించింది.
Also Read: కరోనాపై కేంద్రంపై అప్రమత్తం.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం..
చైనాలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున ఆ దేశం నుంచి వెంటనే విమాన ప్రయాణాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ డిమాండ్ చేశారు.
చైనాతో కరోనా కేసులు పెరుగుదలకు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్ 7 భారత్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ రకానికి చెందిన మూడు కేసులు భారత్లో నమోదయ్యాయ్యని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 అనేది వేరియంట్ BA.5 ఉప వంశం. ఇది అత్యంత వేగంగా సంక్రమించే స్వభావం కలిగి ఉంది. టీకాలు వేసిన వారికి కూడా ఇన్ఫెక్షన్ కలిగించే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక, భారతదేశంలో మొదటి BF.7 కేసును అక్టోబర్లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. ఇప్పటివరకు గుజరాత్లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదైందని ఆ వర్గాలు తెలిపాయి.