మారియన్ బయోటెక్ కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేశాం - కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న దగ్గు మందు తయారీ కంపెనీ మారియన్ బయోటెక్ లో అన్ని రకాల ఉత్పత్తులను నిలిపివేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
భారత్ కు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ డాక్ -1 మ్యాక్స్ వల్ల ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారులు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థలో అన్ని రకాల ఉత్పత్తులు నిలిపివేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) తనిఖీ తర్వాత తయారీని నిలిపివేయాలని ఆదేశించినట్లు మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు.
‘‘డాక్ -1 మ్యాక్స్ దగ్గు సిరప్లో కలుషితమైందన్న నివేదికల దృష్ట్యా సీడీఎస్ సీవో బృందం తనిఖీని అనుసరించి, నోయిడా యూనిట్లోని మారియన్ బయోటెక్ అన్ని తయారీ కార్యకలాపాలు నిన్న రాత్రి నిలిపివేయబడ్డాయి. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.
గురువారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నోయిడాలో నిర్వహించిన తనిఖీలో ఉత్తరప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన బృందాలు సహాయం అందించాయి. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 18 మంది పిల్లలు మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ డోక్ 1 మాక్స్ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించారు. ఈ మరణాలు సమర్కండ్ నగరంలో జరిగినట్లు సమాచారం.
‘‘ ఇప్పటి వరకు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది డాక్ -1 మాక్స్ సిరప్ తీసుకోవడం వల్ల మరణించారు ’’ అని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనాలు డాక్ -1 మాక్స్ సిరప్ శ్రేణిలో ఇథిలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఈ పదార్ధం విషపూరితమైనది. 95 శాతం సాంద్రీకృత ద్రావణం కిలోకు 1-2 మిల్లీ లీటర్ వల్ల రోగిలో వాంతులు, మూర్ఛ, హృదయ సంబంధ సమస్యలు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది.
ఇటీవల న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన దగ్గు సిరప్లు తాగి కనీసం గాంబియాలో 70 మంది చిన్నారులు మరణించారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇదే తరహాలో ఉజ్బెకిస్థాన్ లో కూడా మరణాలు సంభవించాయి. అయితే ఈ పరిణామాలు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
భర్తను చంపించింది.. ఉరితాడుకు బాడీని వేలాడదీసి ఆత్మహత్య కథ అల్లింది.. చివరికి..!
ఈ మరణాలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. ‘‘ మేడ్ ఇన్ ఇండియా దగ్గు సిరప్లు ప్రాణాంతకంగా కనిపిస్తున్నాయి. మొదట గాంబియాలో 70 మంది చిన్నారులు, ఇప్పుడు ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారులు చనిపోయారు. భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా ఉందని మోడీ సర్కార్ ప్రగల్భాలు పలకడం మానుకొని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ’’ అని తెలిపారు.
దీనికి బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బదులిస్తూ.. ‘‘గాంబియాలో పిల్లల మరణానికి, భారతదేశంలో తయారైన దగ్గు సిరప్ వినియోగానికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ విషయాన్ని గాంబియా అధికారులు, డీసీజీఐ ఇద్దరూ స్పష్టం చేశారు. మోడీపై ద్వేషంతో కాంగ్రెస్ భారతదేశాన్ని, దాని వ్యవస్థాపక స్ఫూర్తిని అవహేళన చేస్తూనే ఉంది. ఇది సిగ్గుచేటు.’’ అని అన్నారు.