భర్తను చంపించింది.. ఉరితాడుకు బాడీని వేలాడదీసి ఆత్మహత్య కథ అల్లింది.. చివరికి..!
మహారాష్ట్రలో ఓ మహిళ తన భర్తనే మరో వ్యక్తితో మాట్లాడి చంపించింది. రూ. 30 వేలతో డీల్ కుదిర్చి భర్తను చంపేసి ఉరితాడుకు వేలాడదీసింది. ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేసినా పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ముంబయి: మహారాష్ట్రలో 28 ఏళ్ల వివాహిత తన భర్తను చంపించింది. పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తిని ఇందుకు నియమించుకుంది. రూ. 30 వేల డీల్ కుదుర్చుకుంది. తన భర్తను హత్య చేసిన తర్వాత అతని డెడ్ బాడీని ఉరితాడుకు వేలాడదీశారు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ కట్టుకథ అల్లింది. కానీ, పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదు.. హత్యే అని తేలింది.
మహారాష్ట్రలోని అకోలా జిల్లా దహిహండా పోలీసు స్టేషన్ పరిధిలోని పుండా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఉదయం 32 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. అతని డెడ్ బాడీ ఓ తాడుకు కట్టేసి ఉన్నది. ఆ డెడ్ బాడీపై గాయాలను పోలీసులు గుర్తించారు. ఇది హత్యనే సూచిస్తున్నాయి.
Also Read: తన ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కూతురు.. మహరాష్ట్రలో ఘటన
పోలీసుల విచారణలో ఆ వ్యక్తిది హత్యనే అని తేలింది. ఈ కోణంలో మృతుడి భార్యను పోలీసులు ప్రశ్నించారు. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. పొరుగు ఇంటి వ్యక్తితో తన భర్త హత్య చేయించినట్టు తెలిపింది. రూ. 30 వేల కోసం పొరుగు ఊరికి చెందిన ఓ వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు వివరించారు.
తన భర్త మద్యానికి బానిసయ్యాడని, తరుచూ తనను కొట్టేవాడని ఆ మహిళ ఆరోపించింది. తన భర్త చేస్తున్న వేధింపులతో అలసిపోయానని పేర్కొంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు.