తమ పార్టీకి రాజకీయాలు అంటే తెలియవని, కేవలం అభివృద్ధి, అవినీతి అంతమే తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో పంజాబ్ సీఎంతో కలిసి ఆయన రోడ్ షో చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు కురిపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని కులులో శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. తాము రాజకీయాలు చేయడానికి రాష్ట్రానికి రాలేదని చెప్పారు. అసలు రాజకీయాలు ఎలా చేయాలో ఆప్ కి తెలియదని అన్నారు. అవినీతి నిర్మూలనకు మాత్రమే తమ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.
‘‘మాకు రాజకీయాలు తెలియవు. రాజకీయాలు చేయడానికి మేం ఇక్కడ లేము. మా ప్రయాణం అన్నా హాజరే ఉద్యమంతో మొదలైంది. తరువాత పార్టీ పెట్టాం. అవినీతిని దేశం నుంచి తరిమికొడతామని శపథం చేశాం. ముందు ఢిల్లీలో అవినీతిని అంతం చేశాం. ఇప్పుడు పంజాబ్ లో కూడా అదే చేయబోతున్నాం ’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
అవినీతి ఆరోపణలపై తన మంత్రిని జైలుకు పంపినందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను అభినందించారు. భగవంత్ మాన్ కావాలంటే ఆ విషయాన్ని కార్పేట్ కింద తేలికగా కప్పేయవచ్చని, కానీ ఆయన అలాంటి పనికి పూనుకోలేదని అన్నారు. దానికి బదులు మాన్ మంత్రిపై చర్య తీసుకున్నాడని చెప్పారు. ‘‘ఒక సీఎం తన మినిస్టర్ ను జైలుకు పంపడం మీరు ఎప్పుడైనా విన్నారా ? తన ఆరోగ్య మంత్రి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మన్ సాహబ్ కనుగొన్నారు. ఈ విషయం అప్పటికి ప్రతిపక్షాలకు, మీడియాకు తెలియదు. కావాలంటే ఆయన దానిని చాపకింద పారేసి ఉండేవారు. లేదా ఆ నిమిషం నుంచి తన వాటా అడిగేవాడు. కానీ ఆయన మంత్రిని జైలుకు పంపించాడు.’’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కాంగ్రెస్ - సీపీఎం ఘర్షణల వల్ల సామాన్యులకు ఇబ్బంది - కేంద్ర మంత్రి వి మురళీధరన్
హిమాచల్ప్రదేశ్కు వేల కోట్ల బడ్జెట్ ఉందని, అయితే గత 20 ఏళ్లలో ఇక్కడ కొత్త ప్రభుత్వ పాఠశాల, రోడ్డు, డిస్పెన్సరీ, ప్రభుత్వ ఆసుపత్రిలు నిర్మించారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుందని అన్నారు. ఒకసారి కాంగ్రెసోళ్ల జేబుల్లోకి, మరోసారి బీజేపీ జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. తమ పార్టీ వల్ల ఢిల్లీలో అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు పంజాబ్ లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. త్వరలోనే ప్రతీ రాష్ట్రంలో ఆప్ ఇదే చేసి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ల మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది.
