శ్రీలంక దేశానికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. ఆ దేశం నుంచి మన దేశానికి శరణార్థుల సంక్షోభం లేదని ఆయన చెప్పారు.
శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. అయితే అక్కడి నుంచి మన దేశానికి శరణార్థులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి స్పందించారు. ప్రస్తుతం దేశానికి శరణార్థుల సంక్షోభం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వెలుపల జైశంకర్ మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం పొరుగు దేశానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
జైలు నుంచే నేరాలు.. 81 మంది జైలు అధికారులకు లంచాలు
‘‘ మేము శ్రీలంకకు మద్దతుగా ఉన్నాము. సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాం. అయితే ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదు" అని ఆయన అన్నారు. అయితే తిరువనంతపురంను సందర్శించడానికి గల కారణాలు ఏంటని మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానిమిస్తూ.. ఇక్కడ తన పార్టీలోని సహచరులతో సమయం గడపాలని, వారు ఎలా పని చేస్తున్నారో చూడాలని వచ్చానని అన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
శ్రీలంకకు 1948లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఉన్నత-మధ్య-ఆదాయ దేశంగా ఉన్న ఈ ద్వీప దేశం ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. దీంతో ఆ దేశంలో ప్రజలు తీవ్ర నిరసనలు తెలియజేశారు. రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ తీవ్రమైన నిరసనలు రాజకీయ అశాంతికి దారితీశాయి, మందులు, ఆహారం, ఇంధనం కొరతకు రాజపక్సే బాధ్యత వహించాలని కోరుతూ శనివారం కొలంబోలో లక్షలాది మంది నిరసనకారులు గుమిగూడారు. నిరసనకారులు వలస రాజ్యాల కాలం నాటి అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. రాజపక్సే ఇల్లు, కార్యాలయాలను ఆక్రమించారు. మరికొందరు నిరసన కారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే నివాసానికి నిప్పు పెట్టారు.
మేలో ప్రధానమంత్రిగా నియమితులైన విక్రమసింఘే, ప్రభుత్వ కొనసాగింపు, పౌరులందరి భద్రత కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా బుధవారం తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు. ఇదిలావుండ, శ్రీలంక పర్యాటక, భూముల మంత్రి హరీన్ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి మంత్రి మానుషా నానయక్కరా తక్షణమే తమ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
సాధారణ అవసరాలను దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ నిల్వలు అయిపోయిన తరువాత శ్రీలంక.. ప్రాథమిక వస్తువుల కొరతను ఎదుర్కొంటోంది. అక్కడ నెలల తరబడి ద్రవ్యోల్బణం నెలకొంది. శ్రీలంకలో ఇప్పటికే కొరత ఉన్న పెట్రోల్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీంతో దేశ రాజధాని కొలొంబోకు వెళ్లలేని ప్రజలు శనివారం ఇతర నగరాల్లోనే నిరసనలు చేపట్టారు.