కరోనా వైరస్ ల్యాబ్ లోనే తయారైంది.. నితిన్ గడ్కరీ
ఇండియా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
కరోనా వైరస్ సహజంగా పుట్టలేదని.. అది ల్యాబ్ లో తయారైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. కాగా... ఈ వైరస్ గురించి తాజాగా నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.’ అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
కరోనా విపత్కర పరిస్థితులు తీసుకురావడం వల్ల పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన అంశంపై స్పందించిన గడ్కరీ… ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు క్రియేట్ చెయ్యడం సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.
ఇండియా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని ప్రపంచంలోని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ వంటి దేశాలూ కరోనా గురించి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. భారత్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఏ విధమైన కామెంట్స్ చెయ్యలేదు. అయితే.. తాజాగా కేంద్ర మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.