ముంబైలో హింసాత్మకంగా రిజర్వేషన్ ఉద్యమం.. బస్సులు.. పోలీసులపై రాళ్లదాడి
మరాఠా సమాజ్కు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా క్రాంతి మోర్చా ఇచ్చిన బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది.
మరాఠా సమాజ్కు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా క్రాంతి మోర్చా ఇచ్చిన బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. మరాఠాలకు రిజర్వేషన్లు కోరుతూ ఔరంగాబాద్ జిల్లాలో 27 ఏళ్ల యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని బలి దానానికి నిరసనగా పలు మరాఠా సంఘాలు తమ ఆందోళన ఉధృతం చేశాయి.
ఉదయం నుంచే రోడ్ల మీదకు వచ్చిన ఆందోళనకారులు.. షాపులు, విద్యాసంస్థలను మూయించివేశారు. బస్సులపై రాళ్లు రువ్వారు.. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. బంద్తో దేశ వాణిజ్య రాజధాని ముంబై నిర్మానుష్యంగా మారింది. నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్తో బారులు తీరే రోడ్లు వెలవెలబోతున్నాయి. మరోవైపు సబర్బన్ రైళ్లను పోలీస్ పహారా మధ్య నడుపుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఛత్రపతి శివాజీ టెర్మినస్, కుర్లా, థానే, దాదర్ రైల్వే స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.