జల్లికట్టు అనుమతులపై రచ్చ.. హైవే దిగ్బంధనం, పోలీసు వాహనాలపై రాళ్ల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గోబసందిరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో జల్లికట్టు నిర్వహణ అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసనకు దిగారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గోబసందిరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో జల్లికట్టు నిర్వహణ అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసనకు దిగారు. వందలాది మంది గ్రామస్థులు కృష్ణగిరి-హోసూర్-బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అదే సమయంలో పోలీసుల వాహనాలతో పాటు, ఇతర వాహనాలపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు. మరోవైపు జాతీయ రహదారిని దిగ్భంధించడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ఉదయం నుంచి అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కొందరు పోలీసు అధికారులు గాయపడినట్టుగా తెలుస్తోంది. జల్లికట్టు కోసం ప్రతిపాదిత మైదానాన్ని పరిశీలించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ధర్నాకు దిగినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత విభాగాలు.. నిర్వహకులు చేసిన ఏర్పాట్లను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో గ్రామంలో జల్లికట్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్ అనుమతించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది శాంతిభద్రతల సమస్యగా మారినందున తనిఖీ చేయకుండా కూడా అనుమతిని మంజూరు చేయడానికి అంగీకరించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.