1971 వార్ అమానవీయతపై మానవాళి సాధించిన విజయం - కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
విజయ్ దివాస్ సందర్భంగా భారత వీర జవాన్ల త్యాగాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. 1971 యుద్ధం అమానవీయతపై మానవత్వం సాధించిన విజయం అని అన్నారు.
1971 యుద్ధం అమానవీయతపై మానవత్వం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విజయ్ దివాస్ ను పురస్కరించుకొని ఆయన సైనికుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘‘ విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలకు దేశం వందనం చేస్తోంది. 1971 యుద్ధం అమానవీయతపై మానవాళి సాధించిన విజయం, దుష్ప్రవర్తనపై సద్గుణం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయం. భారతదేశం తన సాయుధ దళాలను చూసి గర్వపడుతోంది’’ అని ట్వీట్ చేశారు.
వైరల్.. మొదటిసారి మంచును చూసిన ఎడారి ఒంటె.. సంతోషంతో పిల్లమొగ్గలేస్తూ కేరింతలు..
1971 యుద్ధంలో పాకిస్తాన్పై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకోవడానికి భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16ని విజయ్ దివస్గా జరుపుకుంటుంది. సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఇదే రోజున భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఇది బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది.
కాగా.. విజయ్ దివస్ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు హాజరయ్యారు. కాగా.. ప్రధాని మోడీ శుక్రవారం సాయుధ దళాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ దళాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘విజయ్ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో భారతదేశం అసాధారణ విజయాన్ని సాధించడానికి కారణమైన ధైర్యవంతులైన సాయుధ దళాల సిబ్బంది అందరికీ నేను నివాళులు అర్పిస్తున్నాను.’ అని ఆయన ట్వీట్ చేశారు.
సాయుధ దళాల త్యాగాలు, సాటిలేని ధైర్యాన్ని రాష్ట్రపతి ముర్ము కూడా గుర్తు చేసుకున్నారు 1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసాధారణ పరాక్రమాన్ని దేశం కృతజ్ఞతతో గుర్తుంచుకుంటుందని, వారి అసమాన ధైర్యసాహసాలు, త్యాగాల కథలు ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తాయని ఆమె ట్వీట్ చేశారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భారత సాయుధ బలగాలకు సెల్యూట్ చేశారు. ‘‘ 1971 యుద్ధంలో నిర్ణయాత్మక విజయానికి కారణమైన మన ధైర్య భారత సాయుధ బలగాలకు సెల్యూట్ చేయడంలో దేశంతో చేరండి. వారి సేవ, త్యాగాలకు మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము’’ అని జైశంకర్ ట్వీట్ చేశారు.