Ajmer Sharif Dargah:  హిందూ దేవుళ్ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన అజ్మీర్ దర్గా మతపెద్ద కొడుకును అరెస్ట్ చేయాలని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది.   

Vishva Hindu Parishad: అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ సయ్యద్ సర్వర్ చిస్తీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ‌డంతో తీవ్ర దుమారమే చెల‌రేగింది. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులకే ఆయన కుమారుడు సయ్యద్ ఆదిల్ చిస్తీ హిందూ దేవుళ్లపై తీవ్ర అభ్యంతరకర, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ బుధవారం ఈ ఘటనను ఖండిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్‌పీ  డిమాండ్ చేసింది. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. "సయ్యద్ ఆదిల్ చిస్తీ  విషపూరిత వ్యాఖ్యల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.. దాని కారణంగా దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించబడింది.. ఇయ‌నకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు కొన‌సాగాగాయి. అలాగే, రాజ‌స్థాన్ లోని ఉదయపూర్‌లో టైల‌ర్ కన్హయ్యను అత్యంత క్రూరంగా న‌రికి చంపారు" అని అన్నారు. 

"హిందూ దేవతలను అవహేళన చేస్తూ అతని కుమారుడు ఆదిల్ చిస్తీ విడుదల చేసిన వీడియో చాలా అభ్యంతరకరం.. మేము దానిని అంగీకరించము" అని సురేంద్ర జైన్ చెప్పారు. "నాగరికత అంటే ఏమిటో ప్రజలు మర్చిపోయారా? హిందువుల భద్రతపై మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నట్లయితే, అజ్మీర్ షరీఫ్‌కు చెందిన ఈ చిష్తీలంద‌రిపై చర్యలు తీసుకోవాలి.. ఆదిల్‌తో పాటు అతని తండ్రి సర్వర్‌ను జైలులో పెట్టాలని నేను రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను" అని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే, "మీరు మంచి మర్యాదలు నేర్చుకోవడం ప్రారంభించండి.. హిందువులను అవమానించవద్దని నేను కూడా చెప్పాలనుకుంటున్నాను" అని ఆయ‌న అన్నారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ సయ్యద్ సర్వర్ చిస్తీ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపగా, ఆయన కుమారుడు సయ్యద్ ఆదిల్ చిస్తీ హిందూ దేవుళ్లపై తీవ్ర అభ్యంతరకర, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రవక్త మొహమ్మద్‌పై ఇప్పుడు సస్పెండ్ చేయబడిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంత‌ర్జాతీయం తీవ్ర దుమారం రేపాయి.  పెద్ద ఎత్తున దేశంలో నిర‌స‌న‌లు, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. గల్ఫ్ దేశాలు సైతం భార‌త్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఏకంగా భార‌త్ వ‌స్తువుల అమ్మ‌కాల‌పై నిషేధం విధించ‌డంద‌తో పాటు భార‌త్ బ‌హిరంగ క్ష‌మాప‌ణాలు చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజుల క్రితం అంజుమన్ కమిటీ కార్యదర్శి సర్వర్ చిస్తీ భారతదేశాన్ని కదిలించే ఉద్యమం గురించి హెచ్చరించారు. ప్రవక్త మొహమ్మద్‌ను అవమానిస్తే ముస్లింలు భారతదేశాన్ని కుదిపేసే ఉద్యమం ప్రారంభిస్తారని ఆయన అన్నారు. 

అయితే, మంగళవారం రాజస్థాన్‌లో మత పెద్దలు నిర్వహించిన శాంతి ర్యాలీలో సర్వర్ చిస్తీ క‌నిపించారు. హిందువులు, ముస్లింలు శాంతియుతంగా జీవించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని నా కోరిక. రెండు వర్గాల ప్రజలు శాంతి, సామరస్యాలతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను' అని సర్వర్ చిస్తీ అన్నారు. గత నెలలో, సర్వర్ చిస్తీ మేనల్లుడు గౌహర్ చిస్తీ, నుపుర్ శర్మపై రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు.