ముంచుకొస్తున్న థర్డ్ వేవ్: వచ్చే నెలలో పిల్లలకు టీకా, ఎంపీలకు మోడీ సంకేతాలు
కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వారికి వీలైనంత త్వరగా టీకాలు వేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
మూడో దశ కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా ఈసారి చిన్నారులపై వైరస్ ప్రభావం అధికంగా వుండే అవకాశం వుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో చిన్నారుల కోసం టీకాను వీలైనంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలోనే చిన్నారుల టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలు చిన్నారుల వ్యాక్సినేషన్పై సంకేతాలు ఇచ్చారు.
ALso Read:ఇండియాలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు: 132 రోజుల తర్వాత 30వేల దిగువకు
చిన్నారుల టీకా కోసం మనదేశంలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో 12-18ఏళ్ల వయసు వారికోసం జైడస్ క్యాడిలా ఇప్పటికే ప్రయోగాలు పూర్తిచేసింది. భారత్ బయోటెక్ మాత్రం 2 నుంచి 18ఏళ్ల వయసు పిల్లలపై మూడో దశ ప్రయోగాలను మూడు విడతల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆరేళ్లకు పైబడిన వారికి రెండు డోసులు ఇచ్చి పరీక్షించింది. వీటి ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండడంతో పాటు వ్యాక్సిన్ కూడా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా ఈ మధ్యే పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా సెప్టెంబర్లో చిన్నారులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు అమెరికా, యూరప్ దేశాలు అనుమతి ఇచ్చాయి. దీంతో ఆయా దేశాల్లో చిన్నారులకు టీకా పంపిణీ కూడా మొదలయ్యింది.