Uttarakhand Assembly Election 2022 : హరక్ సింగ్ రావత్ తన కుటుంబ సభ్యులకు టికెట్ కోరారు- ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ మంత్రి హరక్ సింగ్ రావత్ ఆయన కుటుంబ సభ్యులకు కూడా బీజేపీ నుంచి టికెట్ కోరారని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. మంత్రి బర్త్ రఫ్ పై సీఎం తొలిసారిగా స్పందించారు. తమ పార్టీ కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తుందని తెలిపారు.
Uttarakhand Assembly Election 2022 : ఉత్తరాఖండ్ మంత్రి హరక్ సింగ్ రావత్ (harak singh rawath) బర్త్ రఫ్ పై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి (cm puskar singh dhami) తొలిసారిగా స్పందించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రావత్ పార్టీపై ఒత్తిడి తెచ్చి, తన కుటుంబ సభ్యులకు కూడా పార్టీ టికెట్ కోరారాని తెలిపారు. అయితే తమ పార్టీకొక భిన్నమైన విధానం ఉందని అన్నారు. తమ పార్టీ ఒక కుటుంబంలోని ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తుందని తెలిపారు. ఈ విధానం వల్ల ఇద్దరికి టికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.
తమ పార్టీ అభివృద్ధి, జాతీయవాదం గురించే ఆలోచిస్తుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. రాజవంశ రాజకీయాలకు దూరంగా ఉంటామని అన్నారు. తమ పార్టీ ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్’ వంటి విధానాలను మాత్రమే అనుసరిస్తుందని అన్నారు. రావత్ కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి తమని ఆశ్చర్యానికి గురిచేసినా వాటిని పట్టించుకోలేదని అన్నారు. అయితే రావత్ బహిష్కరణ వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు చోటు చేసుకునే అవకాశం లేదని తెలిపారు.
హరక్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆదివారం సాయంత్రం ఆయనను మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేశారు. అలాగే బీజేపీ నుంచి కూడా ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. 2016 సంవత్సరలో హరీష్ రావత్ (harish rawath) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలలో హరక్ సింగ్ రావత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోట్ద్వార్ (kotedwar) అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని మార్చాలని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో పాటు తన కోడలు అనుకృతి గుసేన్ కు లాన్స్ డౌన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానానికి ఈ విషయంలోనే అభిప్రాయ భేదాలు రావడం వల్ల సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.
హరక్ సింగ్ రావత్ తన నియోజకవర్గమైన కోట్ద్వార్లో ప్రతిపాదిత మెడికల్ కాలేజీ నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం పోయిన నెలలో ప్రబుత్వ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అనేక వార్తలు వెలువడ్డాయి. కానీ దీనిని ఆ సమయంలో అధికార బీజేపీ కొట్టిపారేసింది. మంత్రి సమస్యను పరిష్కరించామని, ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదని, మంత్రి వర్గంలో కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలోనే రావత్ ను పార్టీ నుంచి సస్పెండ్ ను చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి.