టమాట ధరలు పెరగడంపై స్పందన కోరగా ఉత్తరప్రదేశ్ మంత్రి ప్రతిభా శుక్లా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టమాట వాడకం ఆపేస్తే ధరలు తగ్గిపోతాయని వివరించారు. లేదంటే.. టమాటకు బదులు నిమ్మకాయలు వాడుకోవాలని సలహా ఇవ్వడం సంచలనమైంది.  

న్యూఢిల్లీ: టమాటల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంలో ఉత్తరప్రదేశ్ మంత్రి ప్రతిభా శుక్లా సంచలన ప్రకటన చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టమాట ధరలు పెరుగుతున్నాయని తెగ ఆందోళన పడిపోతున్నారని అన్నారు. టమాటలు తినడం మానేస్తే సరి.. ధరలు అవే నేలకు దిగుతాయని ఉచిత సలహా ఇచ్చారు. అంతేకాదు, అవసరమైతే టమాటలకు బదులు నిమ్మకాయలు తినవచ్చని వివరించారు. టమాటలను ఇంటికాడే సాగు చేయాలని పేర్కొన్నారు. టమాటలు తినడం మానేస్తే ధరలు తగ్గిపోతాయని వివరణ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా టమాట ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమాట కనీసం రూ. 120 పలుకుతు్నది. ఈ సమయంలో యూపీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ధరలు తగ్గించడానికి తాము ఏమీ చేయడం లేదని యూపీ ప్రభుత్వం బహిరంగంగానే ఒప్పుకుంటున్నదని ఆరోపించింది. 

Scroll to load tweet…

వేటివైనా ధరలు పెరిగినప్పుడు వాటిని తినకండని సలహా ఇస్తున్నారని కాంగ్రెస్ లీడర్ సుప్రియా శ్రీనాతె అన్నారు. ఈ సలహా కూడా యూపీ మంత్రి నుంచి వస్తున్నదని, వారు ధరల పతనానికి వాస్తవ పరిష్కారాలను అన్వేషించడాన్ని విరమించుకున్నట్టే అనిపిస్తున్నదని పేర్కొన్నారు.

Also Read: కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం.. క్రతువులు చేయాలంటూ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి..

మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి టమాట కొత్త పంట రాగానే ధరలు తగ్గుతాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు తెలియజేశారు. దేశవ్యాప్తంగా టమాట ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనితో ప్రభుత్వాల పైనా ఒత్తిడి పెరుగుతున్నది. ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.