UPSC: నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు.. ఇద్దరు అభ్యర్థులపై యూపీఎస్సీ క్రిమినల్ చర్యలు
యూపీఎస్సీ అభ్యర్థులు ఇద్దరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇరుకులో పడ్డారు. అర్హత సాధించిన ఇద్దరు అభ్యర్థుల రూల్ నెంబర్లు తమవిగా చూపెడుతూ ఫోర్జరీ చేశారు. ఈ కుట్రను బట్టబయలు చేసిన యూపీఎస్సీ ఆ ఇద్దరు అభ్యర్థులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి కీలక సర్వీసుల్లో నియామకాలను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. యూపీఎస్సీ క్రాక్ చేయాలని చాలా మంది అభ్యర్థులు ఉబలాట పడతారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే క్వాలిఫై అవుతుంటారు. ఇలా క్వాలిఫై కాలేని ఇద్దరు వక్రమార్గాన్ని ఎంచుకుని పట్టుబడ్డారు.
మధ్యప్రదేశ్కు చెందిన అయాషా మక్రాని, బిహార్కు చెందిన తుషార్లు డాక్యుమెంట్లు ఫోర్జ్ చేసి ఫ్రాడ్కు పాల్పడ్డారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కమిషన్ తమకు సిఫారసు చేసిందని పేర్కొన్నారు. తమ వాదనకు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లను ఆధారంగా చూపించారు. వాస్తవంగా రికమెండ్ చేసిన ఇద్దరు క్యాండిడేట్ల రూల్ నెంబర్లను తమవిగా వారు నమ్మించే ప్రయత్నం చేశారు.
ఆ ఇద్దరి వాదనలు అవాస్తవాలని యూపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వారి అబద్ధాలను బలంగా వాదించుకోవడానికి ఫోర్జరీ డాక్యుమెంట్లను ఉపయోగించుకున్నారని స్పష్టం చేసింది. తద్వార వారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది.
డిసిప్లీనరీ పీనల్ కింద, క్రిమినల్ సెక్షన్ల కింద వారిపై యాక్షన్ తీసుకోవాలని యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ వ్యవస్థ చాలా పటిష్టమైనదని, ఎలాంటి ఫ్రాడ్లనైనా ఇట్టే తేల్చేస్తుందని, ఎందుకంటే ఇది ఫూల్ ప్రూఫ్ వ్యవస్థ అని వివరించింది.