UPI Server Down.. నిలిచిపోయిన పేటీఎం, గూగుల్ పే సేవలు
ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్లకు అవసరమైన యూపీఐ సర్వర్ డౌన్ అయింది. దీంతో పేటీఎం, గూగుల్ పే సేవలు స్తంభించాయి. డిజిటల్ వ్యాలెట్, లేదా గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్ సేవలు సుమారు గంటపాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత మళ్లీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు ఎన్పీసీఐ ట్విట్టర్లో వెల్లడించింది. యూపీఐ సర్వర్ డౌన్ కాగానే చాలా మంది ట్విట్టర్లో తమ అంతరాయాలను పంచుకున్నారు.
న్యూఢిల్లీ: యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ/ UPI) సర్వర్ డౌన్ (Server Down) అయింది. దీంతో డిజిటల్ వ్యాలెట్(Digital Wallet), ఆన్లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే (Google pay), పేటీఎం (Paytm) వంటి సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్లు అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ యూపీఐని అభివృద్ధి చేసింది. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలు పని చేస్తాయి. కానీ, ఈ రోజు సుమారు ఓ గంట సేపు యూపీఐ సర్వర్ డౌన్ అయింది. దీనితో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలకు సుమారు ఒక గంట సేపు అంతరాయం వాటిల్లింది.
ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇది కేవలం తమకే అవుతున్నదా.? ఇతరులకూ ఈ అంతరాయం ఎదురైందా? అని ప్రశ్నలు వేసుకున్నారు. కాగా, సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఎన్పీసీఐ ఈ అంశంపై ఓ వివరణ ఇచ్చింది. అప్పుడప్పుడు సంభవించే ఇలాంటి అంతరాయల వల్ల కొందరు యూపీఐ యూజర్లు సమస్య ఎదుర్కొన్నారని పేర్కొంది. ఈ అంతరాయానికి చింతిస్తున్నట్టు తెలిపింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ సేవలు అందిస్తున్నదని వివరించింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది.
యూపీఐ సర్వర్ డౌన్ కాగానే చాలా మంది యూజర్లు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. డిజిటల్ వ్యాలెట్ ద్వారా తమ పేమెంట్ ట్రాన్సాక్షన్లు జరగడం లేదని, గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్లూ నిలిచిపోయాయని పేర్కొన్నారు.
అయితే, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్లో ఉన్నదని వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్లో ఉన్నదని తెలిపింది. ఇదే విషయాన్ని టెక్ రివ్యూయర్ నితిన్ అగర్వాల్ ట్విట్టర్లో తెలిపారు. ఐసీఐసీఐ తమ యూపీఐ సిస్టమ్ డౌన్లో ఉన్నదని వెల్లడించిందని, మిగతా యాప్ల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. అంతేకాదు.. అవి ఆదివారం కూడా పని చేస్తాయో లేదో తెలియదని తెలిపారు. అయితే, ఇలాంటి కార్యకలాపాలు వీకెండ్లలో చేయడమే మేలని వివరించారు.
ఈ నెల 3వ తేదీన ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్, యాప్ వర్షన్ సేవలు కూడా నిలిచిపోయాయి. ఫ్లిప్ కార్ట్ సర్వర్ డౌన్ అయింది. అప్పుడు కూడా చాాలా మంది నెటిజన్లు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు.