ఇండియాలో అత్యధిక జీతం వచ్చే టాప్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మంచి హోదా, సామాజిక గౌరవంతో పాటు లక్షల్లో జీతం కూడా వస్తుంది. మరి మన దేశంలో అత్యధిక జీతాలు అందుకుంటున్న టాప్ 6 ప్రభుత్వ ఉద్యోగాలేంటో ఓ లుక్కేద్దాం.

ఓఎన్జిసి ఛైర్మన్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) చైర్మన్ నెలకు రూ.2,80,000 వరకు జీతం పొందుతారు. వీరికి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి... ఇవి కూడా కలిపితే రూ.3 లక్షలకు పైనే శాలరీ. దేశ మౌలిక సదుపాయాలు, ముడి చమురు శుద్ధి ద్వారా దేశానికి ఆదాయం పెంచడం వీరి బాధ్యత.
ఇండియన్ ఆర్మీ చీఫ్స్
భారత సైన్యంలో పనిచేసే సాధారణ జవాన్లకే మంచి శాలరీ ఉంటుంది... మరి ఉన్నత స్థానంలోని వారికి ఏ స్థాయిలో జీతం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మూడు విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు నెలకు రూ.2,50,000 జీతం అందుకుంటారు...అలవెన్సులతో కలుపుకుంటే నెలకు రూ.3,00,000 పొందుతారు. దేశ రక్షణలో వీరిది కీలక పాత్ర.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలకు రూ.2,50,000 జీతం తీసుకుంటారు. ఇతర న్యాయమూర్తులకు ఇదే స్థాయిలో జీతాలుంటాయి. దేశ చట్టాలను కాపాడటం వీరి విధి.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులు మన దేశంలో అత్యధిక జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులలో ఒకరు. వీరు నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 వరకు జీతం పొందుతారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, దేశ ప్రగతి వీరి చేతుల్లోనే ఉంటుంది.
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారులు విదేశాల్లో భారత రాయబారులుగా పనిచేస్తారు. వీరికి నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 వరకు జీతం ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాలు వీరి బాధ్యత.
ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)
సమాజంలో శాంతిభద్రతలను కాపాడే ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారుల జీతం రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు ఉంటుంది. నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడం వీరి ముఖ్యమైన బాధ్యత.

