మెంతి కూర అనుకొని గంజాయి ఆకులతో కూర వండుకొని...
మొత్తానికి గంజాయి ఆకులను ఇంటికి తీసుకువచ్చిన నితేష్.. కూర వండమని తన వదిన పింకీకి ఇచ్చాడు. కూర వండుకున్న ఆ కుటుంబం.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో భుజించారు.
గంజాయి కొద్దిగా తీసుకుంటేనే మత్తులోకి జారిపోతారు. అలాంటిది.. ఏకంగా కడుపు నిండా భోజనం చేసినట్లు తినేస్తే... అదే జరిగింది ఓ కుటుంబం విషయంలో. ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులు మెంతి కూర అనుకొని.. గంజాయి ఆకులతో కూర వండుకొని కడుపునిండా తిన్నారు.
ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మియాగంజ్ గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
మెంతి కూర కావాలని కూరగాయలమ్మే వ్యక్తిని నితేష్ అనే యువకుడు అడిగాడు. దీంతో అతను మెంతి అనుకుని గంజాయి ఆకులను ఇచ్చాడు. నితేష్ కూడా ఆ ఆకులను గమనించలేదు. మొత్తానికి గంజాయి ఆకులను ఇంటికి తీసుకువచ్చిన నితేష్.. కూర వండమని తన వదిన పింకీకి ఇచ్చాడు. కూర వండుకున్న ఆ కుటుంబం.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో భుజించారు.
కూర తిన్న ఆరుగురికి తీవ్ర వికారమైంది. అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. డాక్టర్ను పిలవాలని పక్కింటి వారిని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. దీంతో వారు డాక్టర్ను, పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలు వారు అస్వస్థతకు ఎలా గురయ్యారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఉన్న గంజాయి కూరను, ఆ పక్కనే ఉన్న వండని ఆకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి అవి గంజాయి ఆకులు అని పోలీసులు నిర్ధారించారు. గంజాయి ఆకులను విక్రయించిన కూరగాయలమ్మే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.