2017 తరువాత యూపీలో మహిళలు నిర్భయంగా ఉంటున్నారని, పిల్లలు సురక్షితంగా స్కూల్ కు వెళ్లి వస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమ ప్రభుత్వం మహిళ భద్రతకు పెద్ద పీట వేసిందని చెప్పారు.
up election news 2022 : ఉత్తరప్రదేశ్ (utharpradhesh) లోని ప్రతీ మహిళా సురక్షితంగా ఉండాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలో పోలీసు సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం యోగి ఆదిత్యనాథ్ (cm yogi adhityanath) అన్నారు. నెహ్రూ సెంటర్ లండన్ రచయిత డైరెక్టర్ అమిష్ త్రిపాఠితో (amish tripati) యోగి ఆదిత్యనాథ్ జరిపిన సంభాషణలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేశారు. పశ్చిమ యూపీలో 2017 సంవత్సరం కంటే ముందు బాలికలు నిర్భయంగా పాఠశాలలకు వెళ్లలేకపోయేవారని సీఎం చెప్పారు. కానీ నేడు బాలికలు అందరూ స్కూల్ కు వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నేరగాళ్లు, మాఫియాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. యూపీని 1 ట్రిలియన్ డాలర్ల (1 trilion doller) ఆర్థిక వ్యవస్థగా మార్చడంపై సీఎం మాట్లాడుతూ.. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దాదాపు ఖాళీ అయిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని అన్నారు.
2017 సంవత్సరం కంటే ముందు రాజకీయ నాయకులు మాత్రమే సంతోషంగా ఉండేవారని అన్నారు. ఆ సమయంలో ప్రజలు సమాజ్ వాదీ (samajwadi) ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అందుకే వారందరూ బీజేపీ (bjp)కి ఓట్లు వేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం ఖర్చులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేశామని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ (bjp) ఒక్కటే ఆప్షన్ అని చెప్పారు. ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో నేరగాళ్లు, మాఫియాలకు చోటు లేదని తెలిపారు. ఓటర్లు ఈ సారి కూడా తమకు మద్దతు ప్రకటించాలని కోరారు.
మహిళల భద్రత కోసం, యువత ఉపాధి కోసం, రైతుల ప్రగతి కోసం బీజేపీ పనిచేస్తోందని, అది బీజేపీకి దక్కిన గుర్తింపు అని యోగి అన్నారు. సమాజ్ వాదీ పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అల్లర్లకు, నేరగాళ్లకు సమాజ్వాదీ పార్టీ టిక్కెట్లు ఇస్తోందని అన్నారు. ఎస్పీ ‘రెడ్ క్యాప్’ (red cap) అల్లర్లకు, నేరగాళ్లకు ప్రతీక అని ఆరోపిస్తూ యోగి తీవ్ర విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా యూపీ సీఎం ఇలా తీవ్రమైన పదజాలంతో ఎస్పీపై విమర్శలు గుప్పిస్తుండటంతో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి (central election commission)లేఖ రాసింది. ‘‘ల్యాంగ్వేజ్ ఇన్ అకార్డెన్స్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ కండక్ట్ ’’ కింద యోగి ఆదిత్యనాథ్ కు సూచనలు జారీ చేయాలని ఆ లేఖలో ఎస్పీ కోరింది. ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గూండాలు, మాఫియా వంటి పదాలను తరచుగా ఉపయోగిస్తారని ఆ లేఖలో సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరిగే ఎన్నికల ఫలితాలను 10వ తేదీన లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
