ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్న యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు కీలక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ముస్లింలతో మీకు ఎలాంటి సంబంధం ఉన్నదని ప్రశ్నించగా.. వారికి తనతో ఎలాంటి సంబంధం ఉన్నదో.. తనకూ అదే ఉన్నదని తెలిపారు. అలాగే, తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ, సంతుష్టివాద రాజకీయాలను వ్యతిరేకిస్తామని అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక(UP Assembly Elections)ల్లో సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) గోరఖ్పూర్ నుంచి బరిలోకి దిగారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేయడానికి ఆయన నామినేషన్ కూడా వేశారు. నామినేషన్ తర్వాత తొలిసారిగా ఆయన ముస్లిం సముదాయంపై స్పందించారు. వారికి నాతో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నదో.. వారితో నాకూ అలాంటి రిలేషన్షిప్పే ఉన్నదని తెలిపారు. ‘నా క్యాబినెట్లో ఓ ముస్లిం మంత్రి ఉన్నారు. కేంద్రంలోని ఓ ముస్లిం(Muslim) మంత్రి ఉన్నారు. కేరళ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సేవలు అందిస్తున్నారు. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. మేం మనిషి ముఖాలను చూడం, కేవలం అభివృద్ధిని మాత్రమే చూస్తాం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మా నినాదం. మేం కేవలం జాతి వ్యతిరేక శక్తులే మాకు శత్రువులు’ అని తెలిపారు.
తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ, సంతుష్టివాద రాజకీయాలనే వ్యతిరేకిస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. తమ ప్రభుత్వం ఎవరి పట్లా వివక్ష చూపదని తెలిపారు. సెక్యులరిజం అంటే.. హిందూ మతాన్ని వ్యతిరేకించడం కాదని అన్నారు. సెక్యులరిజం అంటే సంతుష్టివాదమూ కాదని పేర్కొన్నారు. ఒక మతంపై వివక్ష చూపెడుతూ.. మరో మతం పట్ల బుజ్జగింపుగా వ్యవహరించడాన్ని తాము సమర్థించబోమని తెలిపారు.
అదే సందర్భంలో 80 శాతం వర్సెస్ 20 శాతం అని తాను గతంలో చేసిన వ్యాఖ్యలకూ వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలు 20 శాతం.. మిగిలిన వారు 80 శాతంగా ఉంటారని ఒక అంచనా ఉన్నది. ఈ అంచనా ఆధారంగానే 80 శాతం వర్సెస్ 20 శాతం అనే కామెంట్ చేశారని విమర్శలు వచ్చాయి. కాగా, దీనిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందిస్తూ.. తాను అలా పేర్కొనలేదని అన్నారు. అభివృద్ధిని కాంక్షించే వారు.. వర్సెస్.. అవినీతిపరులు, గూండాలు, అల్లర్లు సృష్టించే వారు అని తన అభిప్రాయమని వివరించారు.
80 శాతం మంది ప్రజలు తమ పథకాలతో ప్రయోజనాలు పొందారని, వారికి అభివృద్ధి కావాలని, మహిళలు, రైతుల సంక్షేమం కాంక్షిస్తారని వివరించారు. కాగా, మిగిలిన 20 శాతం మంది ప్రజలు నేరపూరిత కార్యకలాపాలు చేస్తుంటారని, ప్రభుత్వ విధానాలతో వారు బాగా గాయపడుతుంటారని తెలిపారు. కాగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఓట్ బ్యాంకు రాజకీయాలకు దేశ భద్రత కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ గోరఖ్పూర్ నుంచి శుక్రవారం నామినేషన్ వేశారు. లోక్సభకు ఆయన ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, బీజేపీ (bjp) ని ఎదుర్కొవడమే తమ ప్రధాన లక్ష్యమని సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. అందుకే తమ పార్టీ సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇస్తుందని అన్నారు. హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను సమీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘యూపీలో ఎన్నికలలో మేము సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇస్తాము. మేము రాష్ట్రంలో కేవలం నాలుగు స్థానాల నుంచిమాత్రమే పోటీ చేస్తున్నాము. పంజాబ్లో బీజేపీని ఓడించే పార్టీకి మేము మద్దతు ఇస్తాము’’ అని ఆయన తెలిపారు.
