కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫోన్ కాల్లో గుర్తుపట్టలేదు.. ప్రభుత్వ ఉద్యోగిపై యాక్షన్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ ప్రభుత్వ క్లర్క్కు ఫోన్ చేశారు. ఆ క్లర్క్ కేంద్ర మంత్రిని ఫోన్ కాల్లో గుర్తు పట్టలేదు. వెంటనే సీడీవో కేంద్రమంత్రి నుంచి ఆ ఫోన్ తీసుకుని క్లర్క్ను వెంటనే తన ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఆయనపై విచారణకు ఆదేశించారు.
అమేథీ: ఇది కొంత విడ్డూరంగా ఉన్నా వాస్తవమే. ఆయన ప్రభుత్వ క్లర్క్. తనకు ఏకంగా కేంద్రమంత్రి నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఊహించలేదు. తీరా ఓ విషయంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆ క్లర్క్ ఫోన్ చేశారు. కానీ, ఆయన ఊహించనైనా లేదు. ఆ గొంతునూ గుర్తు పట్టలేదు. ఫలితంగా ఇప్పుడు యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తున్నది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫోన్ కాల్ను గుర్తించకపోవడంతో వెంటనే అక్కడే ఉన్న చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోన్ తీసుకుని క్లర్క్తో మాట్లాడారు. వెంటనే ఆ క్లర్క్ తన ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఆ క్లర్క్ మైండ్ బ్లాంక్ అయిపోయింది.
అమేథిలోని ముసాఫిర్ఖానా తహశీల్ పరిధిలోని పూరె పెహల్వాన్ గ్రామంలో 27 ఏళ్ల కరుణేశ్ నివసిస్తున్నాడు. ఆయన తండ్రి టీచర్. కానీ, ఇటీవలే తండ్రి మరణించాడు. తండ్రి మరణంతో తల్లి సావిత్రి దేవీకి పెన్షన్ రావాల్సి ఉన్నది. కానీ, ఆమెకు రావాల్సిన పెన్షన్ ఇంకా రావడం లేదు. క్లర్క్ దీపక్ ఆమె పెన్షన్కు సంబంధించి వెరిఫికేషన్ను పూర్తి చేయలేదు. ఇదే విషయాన్ని కరుణేశ్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముందు చెప్పుకుని భోరుమన్నాడు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెంటనే ఫోన్ తీసుకుని క్లర్క్ దీపక్కు ఫోన్ చేశారు.
కరుణేశ్ కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖ గురించి అమేథీ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంకుర్ స్పందించారు. కరుణేశ్ లేఖ ప్రకారం, ఇది ముసాఫిర్ ఖానా క్లర్క్ దీపక్ నిర్లక్ష్యంగా కారణంగా ఏర్పడిన జాప్యం అని తెలుస్తున్నదని వివరించారు. క్లర్క్ దీపక్ తన బాధ్యతలు నిర్వర్తించలేదని అన్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ముసాఫిర్ ఖానా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ను ఆదేశించినట్టు ఆయన వివరించారు. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.