UP Elections 2022: యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదం విజృంభిస్తుందనీ, సమాజ్ వాదీ పార్టీ ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తుందని అమిత్ షా అన్నారు. అఖిలేష్ యాదవ్ హయాంలో 2,000 మంది రైతులు కరువులో ఆకలితో చనిపోయారని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్లో ఇకపై బాహుబలిలు లేరు.. ఒక్క భజరంగబలి మాత్రమే ఉందని సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఉద్దేశించి అన్నారు.
UP Elections 2022: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీల మధ్య .. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ ఏ రాజకీయ పార్టీ కూడా వదులుకోవడం లేదు.
తాజాగా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బండా జిల్లాలోని తింద్వారి అసెంబ్లీ ప్రాంతంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. సమాజ్వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదం విజృంభిస్తుందనీ, సమాజ్ వాదీ పార్టీ ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తుందని అమిత్ షా అన్నారు. యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. ప్రతి సంవత్సరం రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందచేస్తామని హామీ ఇచ్చారు.
అఖిలేష్ యాదవ్ హయాంలో 2,000 మంది రైతులు కరువులో ఆకలితో చనిపోయారని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్లో ఇకపై బాహుబలిలు లేరు.. ఒక్క భజరంగబలి మాత్రమే ఉందని సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు (ఎస్పి, బిఎస్పి, కాంగ్రెస్) పేదల ఓట్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ తప్ప ఏ ప్రధానమంత్రి పేదలకు మేలు చేయలేదని అన్నారు.
కొన్ని రోజుల క్రితం శాంతిభద్రతల పరిస్థితి ఏమైందని అఖిలేష్ యాదవ్ తనను అడిగారనీ, పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు ప్రతిపక్షాల ఆరోపణలున్నాయని అన్నారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడీలు 72% తగ్గాయనీ, హత్యలు 31% , కిడ్నాప్లు 29 % , లైంగిక దాడులు 50 % తగ్గాయని చెప్పారు.
ఇక అంతకుముందు గొండాలోని కొలనెల్గంజ్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ హామీ మాట్లాడుతూ.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధిస్తే .. ప్రతి సంవత్సరం దీపావళి, హోళి పండుగల సందర్భంగా ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్లలకు స్కూటీని కూడా అందిస్తామని కేంద్ర రక్షణ మంత్రి హామీ ఇచ్చారు.
గుజరాత్ అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిందని సీఎం ఆదిత్యనాథ్ అభివర్ణించారు. మరణశిక్ష పడినవారిలో ఒకరు జంగఢ్లోని సంజర్పూర్కు చెందినవారని పేర్కొన్నారు. ఆ నిందితుడికి, అతని తండ్రికి సమాజ్వాదీ పార్టీతో సత్సంబంధాలున్నాయని విమర్శించారు. గత ఐదేళ్లలో యూపీలో ఎలాంటి ఉగ్రవాద ఘటనలు జరగలేదని, దీనికి ప్రధాన కారణం.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఉగ్రవాదులను ఎరిపారేసిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం అందరి విశ్వాసాలను గౌరవిస్తుందని, భద్రతను కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటుందని అన్నారు.
సమాజ్వాదీ పార్టీ హయాంలో యూపీలో సైఫాయి పండుగ జరిగేదనీ.. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. మధురలో ఛత్ పూజ, రంగోత్సవ్, బృందావన్, దేవ్ దీపావళి, కుంభ్ వంటి పండుగలను వైభవంగా జరుపుకుంటున్నామని అన్నారు. కర్హాల్ ఓటర్లు బీజేపేతర పార్టీలకు సెక్యూరిటీ డిపాజిట్ దక్కకుండా... చేశారని అని ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం పోలింగ్ జరగనున్న కర్హల్ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బరిలో ఉన్నారు.
బీజేపీ, ఎస్పీలకు ట్రిపుల్ తలాక్ : ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ
మరోవైపు... ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీలకు తలాక్, తలాక్, తలాక్ అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఒవైసీ అన్నారు. జలౌన్ జిల్లాలోని మధోగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పి) ఒక్కటేననీ, ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ , యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరులని ఆరోపించారు.
ఎస్పీ, బీజేపీ ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శాలని, యోగి-అఖిలేష్లు విడిపోయిన సోదరులని విమర్శించారు. వారిద్దరి మనస్తత్వం ఒక్కటేననీ, ఇద్దరూ క్రూరులు, దురహంకారులని విమర్శించారు. వారు తమను తాము నాయకులుగా పరిగణించుకోరనీ, చక్రవర్తులుగా భావిస్తారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. మోడీ ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతున్నారనీ, కానీ ఈసారి, ప్రజలు బిజెపి, ఎస్పి లకు ట్రిపుల్ తలాక్ చెప్పారని, ఇక యూపీలోవారి కథ ముగుస్తుందని జోస్యం చెప్పారు.
