నేను సీఎంను అయ్యేదాకా గడ్డం గీసుకోను: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్.. తాను సీఎం అయ్యే వరకు తన గడ్డం తీసుకోరని ప్రకటించారు. తన లక్ష్యం చేరడానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పది రోజుల పాదయాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో చేపడుతున్న పాదయాత్రపైనా విమర్శలు వస్తున్నాయి.
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్(Congress) కమిటీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్(DK Shivakumar) చిత్రమైన శపథం చేశారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు గడ్డం(Beard) గీసుకోనని అన్నారు. తాను సీఎం(Chief Minister) కావడం ప్రజలతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. ‘తిహార్ జైలులో నాకు ఈ గడ్డం పెరిగింది. నేను గడ్డం తీసుకోవడం మీరంతా అందించే విజయం మీదే ఆధారపడి ఉన్నది’ అని అన్నారు. పది రోజుల పాదయాత్ర చేపట్టిన ఆయన ఈ కార్యక్రమంలో భాగంగానే తాజా వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న పది రోజుల పాదయాత్ర రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టడం సరికాదని అధికార పక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి.. వారి లబ్ది కోసం పాదయాత్రలు చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు.
తమిళనాడు, కర్ణాటకల మధ్య శతాబ్దాలుగా రగులుతున్న వివాదం కావేరీ నది జల వివాదం. కావేరీ నదీ జలాలపై ఇరు రాష్ట్రాలకు అతి సున్నితమైన సమస్యగా ఉన్నది. తాజాగా, కావేరీ నదిపై మేకెదాతు డ్యామ్ కట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేకెదాతు నుంచి పది రోజుల పాదయాత్రను ఆదివారం ప్రారంభించింది. వీకెండ్ కర్ఫ్యూ నిబంధనలను ఆదివారం రోజు ఉల్లంఘించిన కారణంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్తోపాటు మరో 30 మంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదయ్యాయి.
డీకే శివకుమార్పై సీఎం బసవరాజు బొమ్మై ఫైర్ అయ్యారు. ఇది ఆయన కల్చర్ను వెల్లడిస్తున్నదని అన్నారు. ఆయన ఇతరుల ఆరోగ్యాల గురించీ చింతించబోడని స్పష్టమైందని చెప్పారు. అయితే, డీకే శివకుమార్ మాత్రం తాను ప్రారంభించిన పాదయాత్రను నిలిపేసే అవకాశమే లేదన్నట్టుగా ఉన్నారు. తమ లక్ష్యం చేరే వరకు పాదయాత్రను నిలిపేసే ప్రసక్తే లేదని ప్రకటించారు.
పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు డీకే శివకుమార్ ఇలా ట్వీట్ చేశారు. మేకెదాతు పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, వారి ప్రేమతో తాము రీచార్జ్ అయ్యామని పేర్కొన్నారు. తాము డే 2 కు రెడీగా ఉన్నామని వివరించారు. తమ లక్ష్యం చేరే వరకు తమను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఈ ఎన్నికలకు ఏడాది కంటే ఎక్కువ కాలమే ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేపట్టింది.
‘ఫొగొనోట్రోఫీ’ అనే పదం వాడి కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ ట్విటర్ లో హల్ చల్ సృష్టించారు. ఈ పదంతో ప్రధాని మోదీ గడ్డానికి లంకె పెట్టారు. ఫొగొనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం. ఓ కొత్త పదం నేర్పాలంటూ ట్విటర్ లో ఓ వైద్యురాలు అడిగిన ప్రశ్నకు థరూర్ బదులిస్తూ.. ‘నా స్నేహితుడు, ఆర్థిక వేత్త రతిన్ రాయ్ ఈ రోజు నాకు ఓ కొత్త పదం నేర్పించాడు. ఫొగొనోట్రోఫీ.. అంటే గడ్డం పెంచడం.. మహమ్మారి వేళ ప్రధానికి కూడా ఫొగొనోట్రోఫీ వ్యాపకంగా మారింది ’ అంటూ ట్వీట్ చేశారు.