ఉన్నావ్ అత్యాచార కేసు: కీచక ఎమ్మెల్యే కుల్దీప్ భార్యకు బీజేపీ టికెట్, విమర్శలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో టికెట్ లభించింది. ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడంతో బీజేపీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో టికెట్ లభించింది.
ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడంతో బీజేపీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెంగార్ను పార్టీ నుంచి బహిష్కరించిన సరిగ్గా ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్యకు బీజేపీ టికెట్ దక్కడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.
కాగా. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలడంతో 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య సంగీత సెంగార్కు ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ అభ్యర్ధిగా బీజేపీ టికెట్ ఇచ్చింది.
Also Read:బ్రేకింగ్: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సేన్ గర్ కు 10ఏళ్ల జైలు!
2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిచారు. సంగీతకు టికెట్ ఇవ్వడంపై పార్టీ వర్గాలతో పాటు రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. తమ చర్యను యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ సమర్థించుకున్నారు.
దీనిపై బీజేపీ ఎంపీ, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ శివ ప్రతాప్ శుక్లా స్పందిస్తూ.. సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు టికెట్ ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆమె పనిచేస్తున్నారని.. ఇలాంటి సమయంలో సంగీతకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలని శుక్లా హితవు పలికారు.
అంతేకానీ నేరస్తుడి భార్య కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడని అభిప్రాయపడ్డారు. కుల్దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఆయన జైల్లో ఉన్నారని.. అతని నేరాలకు సంగీతను శిక్షించకూడదని శివ ప్రతాప్ పేర్కొన్నారు.