ఛత్తీస్గఢ్ యూనివర్శిటీలో విద్యార్థినికి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, అరెస్ట్..
రాయ్ పూర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్లో ఈ ఘటన జరిగింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్ గఢ్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ నెల మొదట్లో ఓ విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా మరువక ముందే ఛత్తీస్ గఢ్, రాయ్పూర్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో.. సదరు ప్రొఫెసర్ మీద కేసు నమోదు చేసినట్లు గత శుక్రవారం పోలీసు అధికారులు తెలిపారు.
నిందితుడు కుషాభౌ ఠాక్రే యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పనిచేస్తున్నాడు. మహిళా పోలీస్ ఠాణా అధికారి తెలిపిన వివరాల ప్రకారం క్యాంపస్లోనే వేధింపుల ఘటన జరిగిందని సమాచారం. ఫిర్యాదు అందిన వెంటనే సదరు ప్రొఫెసర్ మీద భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 (మహిళ నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద అభియోగాలు మోపారు. దీనిమీద దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు.
చెల్లిని గొంతునులిమి చంపి, వంటింట్లో గొయ్యితీసి పాతిపెట్టాడు.. అక్కడే పడుకుంటూ అన్న దారుణం...
ఇదిలా ఉండగా, డిసెంబర్ 3న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్లాండ్కు చెందిన ఓ విద్యార్థినిపై హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో యూనివర్సిటీలో తీవ్ర కలకలం చెలరేగింది. విదేశీ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన రవిరంజన్పై యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్ను ఉన్న ఫళంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.
బాధిత విద్యార్థిని ప్రొఫెసర్ రవిరంజన్ హిందీ నేర్పిస్తాననే సాకుతో తన మీద అత్యాచారయత్నం చేశాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కీచక ప్రొఫెసర్ రవిరంజన్పై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోనకు దిగారు.
కీచక ప్రొఫెసర్ను విధుల నుంచి తొలగించాలని..యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ ఘటనపై స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాదు అత్యాచారయత్నం ఘటన విషయం యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు. అందుకే యూనివర్శిటీ అడ్మిన్పై కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బాధిత యువతి పిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్పై ఇలాంటి ఆరోపణలు కొత్త కాదని.. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.