కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జి20 సదస్సు ఆహ్వాన పత్రిక చర్చనీయంగా మారింది. ఈ ఆహ్వాన పత్రికలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం పలు విమర్శలకు దారి తీస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జి 20 సదస్సును కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. జి20 ఆహ్వాన పత్రికల్లో.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రస్తావించడం పై విమర్శించారు. ప్రధాని మోడీ దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని, దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ తరుణంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయని అన్నారు. దేశం ఇప్పటికీ ఎన్నటికీ భారత్ గానే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు తానేమి చెప్పదలుచుకోలేదని, తాను భారతీయుననీ, తన దేశం భారత్ అని, ఇప్పటికీ ఎప్పటికీ భారత్ గానే ఉంటుందని స్పష్టం చేశారు.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉంటే ఆ పార్టీ చికిత్స చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు సెప్టెంబర్ 18 నుండి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సమావేశాల్లో భాగంగా ఇండియా పేరుకు బదులుగా భారత్ అనే ప్రతిపాదన చెయ్యాలని భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మోడీ సర్కార్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
