విదేశీ టీకాల కోసం కాంగ్రెస్సే ఒత్తిడి తెచ్చింది! ఫైజర్ దుమారంతో ‘హస్తం’పై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అటాక్
విదేశీ టీకాల కోసం కాంగ్రెస్సే ఒత్తిడి తెచ్చిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హస్తం పార్టీపై ఫైర్ అయ్యారు. ఫైజర్ టీకా సామర్థ్యంపై ప్రశ్నలను ఆ కంపెనీ సీఈవో దాటేసిన తరుణంలో కేంద్ర మంత్రి ఈ ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఇప్పుడు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలపై దృష్టి సారించింది. ఈ సమావేశాలు జరుగుతుండగా ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతపై తీవ్ర చర్చ మొదలైంది. ఫైజర్ వ్యాక్సిన్ సామర్థ్యం గురించి ఆ సంస్థ సీఈవో అల్బర్ట్ బౌర్లాను రిపోర్టర్లు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే ఉన్న అనుమానాలను రెట్టింపు చేసేలా రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. దీంతో ఫైజర్ ఎఫికసీ మరోమారు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పై అటాక్ చేశారు.
విదేశీ టీకాలకు అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. తమ టీకా వల్ల దుష్ప్రభావాలు కలిగితే అందుకు తమ బాధ్యత కాదని, ఈ కండీషన్ను అంగీకరించే తమ టీకాలకు అనుమతి ఇవ్వాలని కరోనా ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఫైజర్ కంపెనీ ఒత్తిడి తెచ్చిందని, ఈ విషయాన్ని ఒక సారి గుర్తు చేయాలని భావిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ త్రయం నేతలు రాహుల్ గాంధీ, చిదంబరం, జైరాం రమేశ్లు విదేశీ వ్యాక్సిన్ల కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. ఈ క్యాప్షన్కు తోడుగా ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లాను ఆ టీకా సామర్థ్యంపై ప్రశ్నలు గుప్పిస్తూ విలేకరులు ప్రశ్నిస్తున్న ఓ వీడియోను జత చేసి పోస్టు చేశారు.
Also Read: రెండు కార్లు ఢీ.. కారు బానెట్ పైనే అతడిని కిలోమీటర్ దూరం తీసుకెళ్లిన మహిళ (వీడియో)
2021 ఏప్రిల్లో మన దేశం కరోనా కల్లోల కాలం నుంచి ఈదుతుండగా ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. సీరం తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలతోపాటు ఇతర టీకాలకు అనుమతులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాతి రోజే కేంద్ర ఆరోగ్య శాఖ విదేశీ టీకాలకు అనుమతి కోసం చర్యలు వేగవంతం చేయడం ప్రారంభించింది. 2021 మే నెలలోనూ సెకండ్ వేవ్తో సతమతం అవుతున్న సమయంలో తాము ఐదు కోట్ల డోసులను అందించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఫైజర్ ఆఫర్ ఇచ్చింది. కానీ, ఇండెమ్నిటీ కండీషన్ పెట్టింది.