విభజన చట్టాన్ని గౌరవిస్తాం.. ప్రతి హామీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం:పీయూష్
ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాలని.. గౌరవిస్తున్నామన్నారు. చట్టంలోని హామీలన్నీ క్రమంగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతీ హామీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదా విషయంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని చట్టంలో చెప్పామని.. విభజన సమయంలో బీజేపీ నేతలు కూడా హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని మన్మోహన్ అన్నారు. అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ... ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాలని.. గౌరవిస్తున్నామన్నారు.
చట్టంలోని హామీలన్నీ క్రమంగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతీ హామీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.. 14 ఆర్థిక సంఘం ఏపీకి 42 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే ఐదేళ్లపాటు రెవెన్యూ లోటు పూడుస్తున్నామన్నారు. రెవెన్యూలోటును ఏపీ గ్రాంటుగా పొందిందన్నారు.
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో రాష్ట్రంలో పెద్ద వర్సిటీలు లేవని.. విజయనగరంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశామని.. త్వరలో అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జవదేకర్ తెలిపారు.