ఫ్లైట్లో ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన కేంద్ర మంత్రి, తోటి ప్రయాణికుల నుంచి ప్రశంసలు
మంగళవారం ఢిల్లీ నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన గంటకు ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని సిబ్బంది అడగ్గానే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ వెంటనే పేషెంట్ దగ్గరకు వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై ఇండిగో సహా తోటి ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
న్యూఢిల్లీ: Indigo విమానం.. Delhi నుంచి Mumbai కి బయల్దేరింది. టేకాఫ్ అయినాక ఒక గంట తర్వాత ఓ ప్రయాణికుడు ఆరోగ్య సమస్యతో తల్లడిల్లాడు. ఉన్నట్టుండి తల తిప్పినట్టు అవుతున్నదని, తీవ్ర నీరసం ఆవహించిందని చెప్పాడు. Flightలో ఆకాశంలో ఉన్నది. ప్రథమ చికిత్స కిట్ ఉన్నది.. కానీ.. వైద్యులెవరైనా ఉంటే బాగుండు అని ఫ్లైట్ సిబ్బందికి అనిపించింది. తోటి ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని అడిగారు. ఈ ప్రకటన వినీ వినగానే Union Minister డాక్టర్ భాగవత్ కిషన్రావు కరద్ ఆ పేషెంట్ దగ్గరకు పరుగన వెళ్లి ప్రథమ చికిత్స అందించాడు.
ఢిల్లీ నుంచి ముంబయికి ఇండిగో ఫ్లైట్ 6ఈ 171 బయల్దేరిన గంట తర్వాత 40ఏళ్ల ఓ ప్రయాణికుడిలో నలతగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. దీన్ని ఫ్లైట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని అడిగి ఆ పేషెంట్ పరిస్థితి గురించి చెప్పారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కిషన్రావు కరద్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. కాళ్లు పైకి లేపమని సూచించారు. వెంట వెంటనే పొజిషన్లు మార్చి కూర్చోవలసిందిగా సూచనలు చేశారు. వాటిని పాటించిన ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత కుదుటపడినట్టు చెప్పాడని తోటి ప్రయాణికుడు ఒకరు చెప్పారు. అంతేకాదు, ఎమర్జెన్సీ కిట్లోని ఓ ఇంజెక్షన్ ఆయనకు వేశారు.
Also Read: విమానంలో నటి నడుం పట్టుకుని ఒళ్ళోకి లాక్కుని అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు
ఈ ట్రీట్మెంట్ తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత మెరుగైంది. ఆ తర్వాత సుమారు 45 నిమిషాల తర్వాత అంటే మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో మంగళవారం ఫ్లైట్ ముంబయిలో ల్యాండ్ అయింది. అనంతరం ఆ పేషెంట్ను హాస్పిటల్కు తీసుకెళ్లారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికుడు అమిత్ చవాన్ ఈ ఘటనపై ట్వీట్ చేశాడు. ‘గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ వృత్తిరీత్యా వైద్యుడు. ఇండిగో విమానం ఎక్కిన తర్వాత ఓ ప్రయాణికుడు అనారోగ్యానికి గురవ్వడంతో ప్రథమ చికిత్స అందించి సహకరించాడు. తోటి ప్రయాణికులు కేంద్ర మంత్రిపై ప్రశంసలు కురిపించారు’ అని పేర్కొన్నారు. ఇండిగో కూడా కేంద్ర మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది.
డాక్టర్ భాగవత్ కరద్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. జులై 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ప్రక్షాళనలో డాక్టర్ భాగవత్ కరద్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.