ఇటీవల హత్యకు గురైన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. ఈ క్రమంలో సిద్దూ తండ్రి బాల్‌కౌర్ కన్నీటీ పర్యంతమయ్యారు. త్వరలోనే సిద్ధూను హత్య చేసిన వారిని పట్టుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చారు.   

ఇటీవల దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (sidhu moose wala) తల్లిదండ్రులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) శనివారం పరామర్శించారు. చండీగఢ్‌ పర్యటనలో భాగంగా వారితో మాట్లాడిన  ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సిద్దూ తండ్రి బాల్‌కౌర్ కన్నీటీ పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన హోంమంత్రి సిద్ధూ హత్య కేసు నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. సిద్ధూ హత్య కేసును పంజాబ్ పోలీసులతో (punjab police) కాకుండా  కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించాలని ఆయన కుటుంబం ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసింది. ఈ క్రమంలో హోంమంత్రి వారితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (bhagwant mann) సైతం సిద్ధూ కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే. 

Also Read:సింగర్ సిద్ధూ హ‌త్య కేసులో కీల‌క ఆధారాలు ల‌భ్యం.. పెట్రోల్ బంక్ సీసీ పుటేజ్ లో నిందితుల గుర్తింపు.. ?

ఇకపోతే.. సిద్ధూ మూస్ వాలాను తామే హత్య చేసినట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (lawrence bishnoi) అంగీకరించిన సంగతి తెలిసిందే. అతనితో తమకు శతృత్వం వుందని ఈ క్రమంలోనే కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ (goldy brar) అనే మరో గ్యాంగ్‌స్టర్ సాయంతో హత్య చేయించినట్లు లారెన్స్ చెప్పారు. అయితే ఈ ఘ‌ట‌నపై కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసుల‌కు కీలక ఆధారాలు ల‌భ్యం అయిన‌ట్టు తెలుస్తోంది. ఓ పెట్రోల్ బంక్ లో ఇద్ద‌రు అనుమానితులకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేక‌రించారు. ఫతేహాబాద్ ప్రాంతంలో ఈ పెట్రోల్ బంక్ ఉంది. 

ఈ ఫుటేజీలో కనిపించిన కారు సిద్ధూ మూస్ వాలా హత్యకు ఉపయోగించిన కారు అని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కారు నడుపుతున్న వ్యక్తి జాంటీ అనే గ్యాంగ్ స్టర్ గా, మరో నిందితుడిని పర్వత్ ఫౌజీగా గుర్తించారు. ఇద్దరు అనుమానితులు ఫ్యూయ‌ల్ నింపేందుకు ఆ కారు నుంచి దిగారు. ఆ స‌మ‌యంలో వారి ఫేస్ లు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జాంటీ, ఫౌజీ ఇద్దరూ సోనిపట్ కు చెందిన‌ గ్యాంగ్ స్టర్లు కావడంతో హర్యానాలోని గ్యాంగ్ స్టర్ నెక్సస్,  సిద్ధూ మూస్ వాలా హత్యకు మధ్య ఉన్న సంబంధం ఏంట‌న్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. అయితే ఈ ఫుటేజ్ లో క‌నిపించిన వారి జాడ కోసం గాలిస్తున్నారు. 

కాగా.. మే 29వ తేదీన తన మిత్రులతో కలిసి స్వగ్రామానికి చేరుకుంటున్న సిద్ధూ మూసేవాలాను వెంబడించిన దుండగులు.. జవహర్‌కే గ్రామం వద్ద ఆయన కారుకు వాహనాలు అడ్డుపెట్టారు. అనంతరం అసాల్ట్ రైఫిల్‌తో మూసేవాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో వున్న సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆయన మిత్రులు గాయాలతో బయటపడ్డారు. పంజాబ్‌లో వీఐపీలకు భద్రత ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.