ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి భేటీ ముగిసింది. రూ. 4,526.12 కోట్లతో జమ్ము-కాశ్మీర్‌లో నిర్మించనున్న 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి (Union Cabinet) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మావోయిస్టు (maoist) ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని నిర్ణయించింది. అలాగే 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ. 2,426.39 కోట్ల కేటాయింపునకు అనుమతించింది. దీనిలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయనుంది కేంద్రం. దీని వల్ల మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం సులభం అవుతుందని కేంద్రం యోచిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక, ఈ ఖరీఫ్ సీజన్‌లో ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గతేడాదితో పోల్చితే 50 శాతం సబ్సిడీ పెరిగింది.. తద్వారా మొత్తం సబ్సిడీ విలువ రూ. 60,939.23 కోట్లు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు, డీఏపీకి కూడా సబ్సిడీ వర్తించనుంది. దీనితో పాటు 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు (Kwar hydro power project) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 4,526.12 కోట్లతో జమ్ము-కాశ్మీర్‌లోని (Chenab Valley Power Projects Ltd) కిష్త్వార్‌ వద్ద చీనాబ్ ( Chenab) నదిపై ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 54 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానుండగా.. 2,700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.