ఢిల్లీ ప్రోఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలి:ఐరాస మానవ హక్కుల నిపుణులు
ఢిల్లీ ప్రోఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలి
న్యూఢిల్లీ: జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఢిల్లీ ప్రోఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు భారత ప్రభుత్వాన్ని కోరారు.ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనను విడుదల చేయాల్సిందిగా కోరారు.
మహారాష్ట్ర పోలీసులు ప్రోఫెసర్ సాయిబాబాను అరెస్ట్ 2014లో అరెస్ట్ చేశారు. గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017 మార్చిలో ప్రోఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చారు. 2018 మార్చిలో నాగ్పూర్ జైలు నుండి ప్రోఫెసర్ సాయిబాబా ఆయన భార్యకు లేఖ రాశాడు. ఈ మేరకు ఆయన భార్య వసంత పలు మానవహక్కుల సంఘాలను కలిసింది. ప్రోఫెసర్ సాయిబాబా పరిస్థితి గురించి ఆమె వివరించింది.
ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల నిపుణులు జెనీవా నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు. వీల్ఛైర్ కోసమే పరిమితమైన సాయిబాబాను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జైలు నుండి విడుదల చేయాలని ఆ ప్రకటనలో కోరారు.
సాయిబాబా సుమారు 15 రకాలైన ఆరోగ్య సంబంధమైన సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడని వారు ఆ ప్రకటనలో గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసరంగా వైద్యం అవసరమని వారు ఆ ప్రకటనలో గుర్తు చేశారు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని అతడిని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల నిపుణలు భారత ప్రభుత్వాన్ని కోరారు.