Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో మెడిసిన్‌కు అవకాశమివ్వండి .. మరోసారి సుప్రీంకోర్టుకెక్కిన ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులు

భారత్‌లో మెడిసిన్ పూర్తి చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్ధులు మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా వారు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

 Ukraine-returned medical students filed petition in Supreme Court
Author
New Delhi, First Published Jul 31, 2022, 6:57 PM IST

మరోసారి సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించారు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్ధులు (Ukraine-returned medical students). దేశంలోనే మెడిసిన్ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని వారు పిటిషన్‌లో కోరారు. ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్ధుల పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. ఇక్కడ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక న్యాయం కావాలంటూ ఇటీవల ఢిల్లీ వేదికగా వేల మంది ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 

ఆపరేషన్ గంగా పేరుతో తమను స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్రం.. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందని విద్యార్ధులంటున్నారు. ఆరు నెలలు కావొస్తున్నా తమకు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తమకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామంటున్నారు. అడ్మిషన్ కోసం గతంలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేశామని .. నేషనల్ మెడికల్ కౌన్సిల్ భవనం ఎదుట ఆందోళనలు చేపట్టినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతీయ మెడికల్ కౌన్సిల్ చట్టాల నిబంధనలను అంగీకరించాలని చెబుతోంది. 

కాగా.. ఉక్రెయిన్ నుండి సుమారు 18 వేల మంది వైద్య విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. పలు రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో ఉక్రెయిన్ కు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్క Kerala రాష్ట్రంలోనే సుమారు 3,900 మంది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్నారు. 

ALso Read:దిగిరాని కేంద్రం.. ఢిల్లీలో ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల ఆందోళన

అయితే ఢీల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్,  రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంబీబీఎస్ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఈ విషయమై ఆందోళన చేస్తున్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్ధులు తమ విద్యను కొనసాగించేందుకు గాను తమ సహాయం చేస్తామని తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. అయితే ఇంతవరకు ఈ విద్యార్ధుల చదువు విషయమై ఇంకా స్పష్టత రాలేదు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు కేంద్రాన్ని కోరుతున్నారు.  

ఇకపోతే.. ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులపై గతవారం కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌కు వచ్చిన వైద్య విద్యార్ధులకు లోకల్ కాలేజీలలో అడ్మిషన్లపై ఎన్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios