ఖలిస్తాని శక్తులను ఖండించిన యూకే సిక్కులు.. ప్రధాని మోడీపై ప్రశంసలు
దేశంలో కొంతకాలంగా ఖలిస్తానీల చర్చ జరుగుతున్నది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాడ్పుతున్నారనే ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. ముఖ్యంగా యూకేలోనైతే గత కొన్ని నెలలుగా మోడీ ప్రభుత్వ వ్యతిరేక ఎజెండాతో అనేక క్యాంపెయిన్లు చేపట్టాయి. వీటిపై అక్కడి సిక్కులు చాలా కాలం మౌనం దాల్చారు. కానీ, తాజాగా అక్కడి సిక్కుల సముదాయం ఘాటుగా స్పందించింది. దేశ వ్యతిరేక శక్తులను ఖండించడమే కాదు.. ప్రధాని మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాయి. సిక్కుల కోసం ఎంతో చేశారని కొనియాడారు. డిసెంబర్ 26న బీర్ బాల్ దివస్గా గుర్తించి.. పబ్లిక్ హాలిడేను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా దేశంలో ఖలిస్తానీ(Khalistan)ల గురించిన చర్చ ఊపందుకున్నది. రైతుల ఆందోళనల సమయంలో నుంచి ఇప్పటి వరకు ఈ ఖలిస్తానీల గురించి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ(PM Modi)కి పంజాబ్లో ఏర్పడ్డ భద్రతా లోపం సమయంలోనూ వీరిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ప్రధానికి భ్రదతా లోపం ఏర్పడటానికి వెనుక ఖలిస్తానీలు ఉన్నట్టు కొన్ని ప్రకటనలూ వచ్చినట్టు పలుకథనాలు వెల్లడించాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Pujab Assembly Election) సమీపిస్తున్న తరుణంలో సిక్కుల మధ్య ఖలిస్తానీ చర్యలు చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా పంజాబ్లో ఖలిస్తానీల తీరుపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే యూకే సిక్కులు(UK Sikhs) కీలక ప్రకటన చేశారు.
దేశ వ్యతిరేక కార్యక్రమాలను యూకే సిక్కులు తీవ్రంగా ఖండించారు. ఈ క్యాంపెయిన్లనూ ఖలిస్తానీ చేపడుతున్నదనే కోణంలో వారు మాట్లాడారు. కొన్ని నెలలుగా యూకేలో ఖలిస్తానీ సారథ్యంలో అనేక క్యాంపెయిన్లు జరిగాయి. అందులో మోడీ ప్రభుత్వ వ్యతిరేకతే ఎక్కువగా కనిపంచింది. ఈ తరుణంలో యూకేలోని పార్క్ అవెన్యూ సమీపంలోని సౌథాల్లో గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా దగ్గర సిక్కులు సమావేశం అయ్యారు. సిక్కులకు ఎంతో మేలు చేకూర్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ తీర్మానం చేశారు. అనేక భిన్నాభిప్రాయాలను, విభేదాలను అర్థం చేసుకోవడానికి ఓ వారధి వేశారని కొనియాడారు. అంతేకాదు, డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్గా ప్రకటించి.. ఆ రోజున పబ్లిక్ హాలీడేను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో కొన్ని గ్రూపులు, భారత దేశ వ్యతిరేక, ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని, అందులో చాలా వరకు అవాస్తవాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
యూకేలో అతిపెద్ద సిక్కుల సముదాయంగా లండన్లోని ఈ సౌథాల్లోనే ఉన్నది. ఆ దేశంలోని పెద్ద పెద్ద, ప్రముఖమైన గురుద్వారాలు వీరి అధీనంలోనే ఉన్నాయి. అలాంటి సిక్కు సముదాయం ప్రత్యేకంగా సమవేశమై.. ఈ ప్రకటన చేయడం గమనార్హం. పిడికెడు మంది ఖలిస్తానీలు చేస్తున్న దుష్ప్రచారంపై ఇన్నాళ్లు అక్కడి సిక్కులు మౌనంగానే ఉన్నారు. వారి ప్రచారంపై స్పందించడానికి విముఖత చూపారు. కానీ, తాజా ప్రకటన.. సాహసోపేతమైనదని సిక్కు కమ్యూనిటీలోని వారే కొందరు అంటున్నారు.
గురు గోవింద్ సింగ్ 365వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. డిసెంబర్ 26వ తేదీని వీర్ బాల్ దివస్గా వేడుక చేసుకోవాలని ప్రకటించారు. గురు గోవింద్ సింగ్ కొడుకుల శౌర్యానికి నివాళిగానే ఈ ప్రకటన అని పేర్కొన్నారు.
ఔరంగజేబును ఎదుర్కోవడంలో చూపిన తెగువ, సాహసాలు, త్యాగాలు చేసిన గురు తేగ్ బహదూర్ దేశానికి తీవ్రవాదంపై పోరును ఎలా చేయాలో నేర్పించాడని ప్రధాని మోడీ తెలిపారు.