మహా సంక్షోభం.. రంగంలోకి దిగిన ఉద్ధవ్ ఠాక్రే సతీమణి.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలకు ఫోన్లు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో ఎపిసోడ్ ముందుకు వస్తున్నది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మి ఠాక్రే రంగంలోకి దిగి రెబల్ ఎమ్మెల్యేల భార్యలను కాంటాక్ట్ అవుతున్నట్టు తెలిసింది. వారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేయాలని సూచనలు చేస్తున్నట్టు సమాచారం.
ముంబయి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి దూరంగానే ఉన్నారు. అసోం రాష్ట్రంలోనే ఉండి తమ తిరుగుబాటును కొనసాగిస్తున్నారు. సీఎం, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నేరుగా తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో మాట్లాడిన ఫలితం లేకపోయింది. ఇరువర్గాల నుంచి అనూహ్య ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మి ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్ ఎమ్మెల్యేల సతీమణులను కాంటాక్ట్ కావడం ప్రారంభించారు. తిరుగుబాటు లేవదీసిన తమ భర్తలను కన్విన్స్ చేసి తిరిగి మహారాష్ట్రకు రప్పించాలని వారిని ఆమె అప్రోచ్ అవుతున్నట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది. కాగా, ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్ ఎమ్మెల్యేలకు మెస్సేజీలు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే సారథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు గువహతిలోని ఓ హోటల్లో ఉన్నారు.
ఇదిలా ఉండగాా, రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. ‘‘ మీరు గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారు ? మీరు చౌపట్టికి తిరిగి రావాలి ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. శివసేన అనర్హత పిటిషన్పై 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ చిత్రాన్ని కూడా ఆయన ఈ ట్వీట్ తో షేర్ చేసుకున్నారు. జిర్వాల్ శనివారం షిండేతో సహా 16 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అసమ్మతి శాసనసభ్యులు తమ లిఖితపూర్వక సమాధానాలను దాఖలు చేసేందుకు సోమవారం వరకు గడువు ఇచ్చారు.