ఉద్దవ్ ఠాక్రే కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారు - పోలీసులకు బీజేపీ నేత తజిందర్ బగ్గా ఫిర్యాదు
మహారాష్ట్ర సీఎంకు కరోనా సోకినా.. ఆయన తన మద్దతు దారులను కలిశారని బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా ఆరోపించారు. కోవిడ్ ప్రొటోకాల్ ను ఉద్దవ్ ఠాక్రే ఉల్లంఘించారని చెబుతూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినందుకు, ఆయన మద్దతుదారులను కలిసినందుకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేపై బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఆన్ లైన్ ద్వారా పోలీసుకు ఫిర్యాదు చేసిన కాపీని ట్విట్టర్ లో షేర్ చేశారు. సీఎంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు బుధవారం కోవిడ్ -19 సోకింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని సీఎం తన వెబ్ కాస్ట్ మీటింగ్ లో సీఎం ధృవీకరించారు. కాగా బుధవారం రాత్రి తన సీఎం తన అధికారిక నివాసం నుంచి బయటకు బయటకు వెళ్లినప్పుడు ఆయన తన మద్దతు దారులను కలిసి అభివాదం చేశారు. దీంతో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, ప్రజలను కలుసుకున్నారని పేర్కొంటూ బగ్గా ముంబైలోని మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
‘‘ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం రోగి ఎవరినీ కలవకూడదు. ఐసోలేషన్లోనే ఉండాలి. కానీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోవిడ్ ప్రోటోకాల్లను ఉల్లంఘించి తన మద్దతుదారులతో సమావేశమయ్యారు ’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించడంపై బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ ఉద్ధవ్ ఠాక్రేకు కోవిడ్ పాజిటివ్ అని మాకు తెలిసింది. కానీ ఆయన శరద్ పవార్ను తన నివాసంలో కలుసుకున్నాడు. ప్రజల మధ్యకు వెళ్ళారు. ఆయన తిరిగి ఇంటికి వెళ్లాలని చూశారు. ఆయన మొదట వదిలి ఉండకూడదు. ఈ మోసం సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు దారితీసింది’’ అని అమిత్ మాల్వియా బుధవారం ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం అయిన వర్షను కాళీ చేశారు. అక్కడ నుంచి తన నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు. దీని కంటే ముందు ఆయన ప్రజలు ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. సొంత ఎమ్మెల్యేలు తనను వద్దనడం బాధగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా వుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా .. ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శివసేన చీఫ్గా కూడా దిగిపోవడానికి సిద్ధంగా వున్నానని.. తాను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో ఏక్నాథ్ నేరుగా మాట్లాడాలని సీఎం స్పష్టం చేశారు.
శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చని ఠాక్రే చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు. హిందుత్వాన్ని శివసేన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని సీఎం పేర్కొన్నారు. తాను ప్రజల్ని కలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 30 ఏళ్లుగా తాము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించామని ఉద్ధవ్ గుర్తుచేశారు. కానీ శరద్ పవార్ .. తననే సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కోరారని ఆయన చెప్పారు. అలాంటి పరిస్ధితుల్లో ఛాలెంజింగ్గా బాధ్యతలు స్వీకరించానని.. ఎన్సీపీ, కాంగ్రెస్ తనకు పూర్తి సహకారం అందించాయని ఠాక్రే తెలిపారు.