కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి అపెక్స్ కౌన్సిల్దే: గజేంద్ర షెకావత్
కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్పణకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు
న్యూఢిల్లీ: కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్పణకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ మంగళవారం నాడు మీడియాకు వివరించారు. రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది.
also read:ఏపీ, తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వివాదం: ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పాల్గొన్నట్టుగా కేంద్ర మంత్రి వివరించారు.ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.
కృష్ణా, గోదావరిపై ఏ ప్రాజెక్టు కట్టాలన్నా వాటికి అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్ దేనని ఆయన స్పష్టం చేశారు.ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగినట్టుగా ఆయన వివరించారు. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్ఫణకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని చెప్పారు.
నీటి వాటాలపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరిగిందని ఆయన తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు ఏపీలో ఏర్పాటుకు ఈ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు.ట్రిబ్యునల్ అవార్డులను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు. ఆరేళ్ల తర్వాత కూడ కృష్ణా, గోదావరి నదుల సరిహద్దులు ఇంకా నోటిఫై కాలేదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విభజన చట్టం ప్రకారంగానే రెండు రాష్ట్రాలకు నీటి వాటాలను పంచుతామని ఆయన తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం సహకరించిన ఇద్దరు సీఎంలకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో పరిష్కారానికి వచ్చామన్నారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగానే నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ సీఎం కోరినట్టుగా ఆయన వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని త్వరలో కేంద్రం నిర్ణయిస్తోందని ఆయన చెప్పారు.