ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ రాజీనామా.. బాధ్యతల్లోకి భారత సంతతి పరాగ్ అగ్రావాల్
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ రాజీనామా చేశారు. ఈ నెల 29న ఆయన రాజీనామా చేశారు. ట్విట్టర్ తదుపరి సీఈవోగా పరాగ్ అగ్రావాల్ను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఎంచుకుంది. ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు, జాక్ డోర్సీ ట్విట్టర్ సీఈవోగా 2015 నుంచి కొనసాగుతున్నాడు. ఈ రోజు ఆయన రాజీనామా చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్(Twitter) సీఈవోగా జాక్ డోర్సీ(Jack Dorsey) రాజీనామా(Resignation) చేశారు. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చింది. 16ఏళ్లపాటు సీఈవోగా కొనసాగిన ఆయన తన రాజీనామా లేఖను ఈ రోజు ట్విట్టర్లో షేర్ చేశారు. జాక్ డోర్సీ తర్వాత తదుపరి సీఈవోగా పరాగ్ అగ్రావాల్ను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఎంచుకుంది. పరాగ్ అగ్రావాల్ ఇప్పటి వరకు కంపెనీ చీఫ్ టెక్నాలజీ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ‘ట్విట్టర్ సంస్థ ఇప్పుడు దాని వ్యవస్థాపకుల నుంచి కూడా ఇంకా ముందుకు పోవడానికి అన్ని అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి, నేను ట్విట్టర్ సీఈవోగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని జాక్ డోర్సీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
2015 నుంచి జాక్ డోర్సీ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. సీఈవోగా రాజీనామా చేసినప్పటికీ ఆయన 2022 వరకు బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. జాక్ డోర్సీ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడని తెలిసిందే. కాగా, తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపడుతున్న పరాగ్ అగ్రావాల్పై జాక్ డోర్సీ విశ్వాసాన్ని ప్రకటించారు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగ్రావాల్పై తనకు అపారమైన నమ్మకం ఉన్నదని, చీఫ్ టెక్నాలజి అధికారిగా ఆయన నైపుణ్యాలను తాను గమనించానని వివరించారు. గత పదేళ్లుగా ఆయన నైపుణ్యాలు అమోఘంగా సంస్థకు అందాయని తెలిపారు. ఆయన ఈ సంస్థకు నాయకత్వం వహించడానికి సమయం ఆసన్నమైందని తెలిపారు.
Also Read: మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెల్లా మరో ఘనత.. కంపెనీ చైర్మన్ గా కీలక భాధ్యతలు..
పరాగ్ అగ్రావాల్ 2011లో ట్విట్టర్ సంస్థలో చేరారు. 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్నారు. ట్విట్టర్ సంస్థలో చేరక ముందు పరాగ్ అగ్రావాల్ యాహూ, మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్టీ ల్యాబ్స్లో సేవలు అందించారు. 2006 నుంచి 2010 వరకు ఆయన రీసెర్చ్ టీమ్స్తో కలిసి పని చేశారు. అగ్రావాల్ బీటెక్ డిగ్రీ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్స్ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. ట్విట్టర్ అనూహ్యంగా అభివృద్ధి చెందడంలో (సాంకేతికపరంగా) పరాగ్ అగ్రావాల్ టెక్నికల్ స్ట్రాటజీ కీలకంగా ఉన్నది.
జాక్ డోర్సీ రాజీనామా అనంతరం తనను ఏకగ్రీవంగా నూతన సీఈవోగా నియమించడంపై పరాగ్ అగ్రావాల్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. జాక్ డోర్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్లో మరో పరిణామం కూడా చోటుచేసుకుంది. నూతన సీఈవోగా పరాగ్ అగ్రావాల్ను ఎంచుకున్న తరుణంలోనే 2016 నుంచి బోర్డు మెంబర్గా కొనసాగుతున్న బ్రెట్ టైలర్ను సంస్థ స్వతంత్ర చైర్పర్సన్గా ఎన్నుకున్నారు.
Also Read: కెనడాలో భారత సంతతి మహిళ ఘనత.. రక్షణ మంత్రిగా అనితా ఆనంద్
పరాగ్ అగ్రావాల్ ట్విట్టర్ సీఈవోగా ఎన్నిక కావడంతో భారత సంతతి మరో ఘనత సాధించినట్టయింది. దిగ్గజ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో భారత సంసతి వ్యక్తులు ఉన్నారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్కు, మైక్రోసాఫ్ట్కు సత్య నాదెళ్ల నేతృత్వం వహిస్తున్నారు. ఐబీఎంకు అరవింద్ క్రిష్ణ, అడోబ్ చీఫ్గా శాంతాను నారాయణ్లు ఉన్నారు. ఈ జాబితాలో ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగ్రావాల్ చేరారు. వీరంతా భారత సంతతి వాళ్లే కావడం గమనార్హం.