దిగొచ్చిన పళనిసామి ప్రభుత్వం: స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
స్థానికుల ఆందోళనకు, ప్రతిపక్షాల విమర్శలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి ప్రభుత్వం దిగొచ్చింది.
చెన్నై: స్థానికుల ఆందోళనకు, ప్రతిపక్షాల విమర్శలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి ప్రభుత్వం దిగొచ్చింది. తుత్తూకుడిలోని స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజల మనోభావాలను గౌరవించి దాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్లాంట్ పదే పదే ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు క్యాన్సర్, తదితర వ్యాధులతో బాధపడుతున్నారు.
గత మూడు నెలలుగా స్థానికులు ప్లాంట్ ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించడంతో అది తీవ్రస్థాయికి చేరుకుంది.
ప్రతిపక్షాల కారణంగానే ఆందోళన హింసాత్మకంగా మారిందని పళనిస్వామి విమర్శించారు. ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన అన్నారు.