జనాలపైకి దూసుకెళ్లి ట్రక్.. 12 మంది మృతి.. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ
Vaishali: వైశాలిలో వేగంగా వచ్చి ఒక ట్రక్ జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
Truck Rams Into Crowd in Bihar's Vaishali: బీహారల్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వైశాలిలో వేగంగా వచ్చి ఒక ట్రక్ జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
వివరాల్లోకెళ్తే.. బీహార్ లోని వైశాలి జిల్లా మహానార్ లో ఆదివారం రోడ్డు పక్కన ఉన్న జనావాసంలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుల్తాన్పూర్ సమీపంలోని రాష్ట్ర మహానార్-హాజీపూర్ హైవే వద్ద భుయాన్ బాబా పూజా ఊరేగింపును వీక్షించడానికి ప్రజలు గుమిగూడారు. ఈ క్రమంలోనే అక్కడగా వస్తున్న ట్రక్ జనాల పైకి దూసుకెళ్లింది. క్షతగాత్రులను వెంటనే హాజీపూర్ లోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న సీనియర్ పోలీసులు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సుల్తాన్ పూర్-28 తోలా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ మాట్లాడుతూ 12 మంది చనిపోయారని చెప్పారు. వారిలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని చెప్పారు. వైశాలి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ మాట్లాడుతూ, "మరణించిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నారు. మేము ధ్వంసమైన వాహనం నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న ట్రక్ డ్రైవర్ కూడా మరణించి ఉండవచ్చు" అన్ని ఆయన అన్నారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ మృతులకు సంతాపం ప్రకటించారు. అలాగే, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంటూ.. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రామాణిక విధానంలో ఎక్స్గ్రేషియా అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులందరికి ఆదేశాలు ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ట్విట్టర్లో.."ఈ రాత్రి హాజీపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక మంది మరణించిన హృదయ విదారక వార్త కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతిని, వారి కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.