బ్రతికుండగానే.. వాజ్ పేయి చనిపోయారని ట్వీట్.. వివాదం
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ వివాదాలకు దారి తీసింది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో బీజేపీ నేతలు కంగారపడుతున్నారు.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ వివాదాలకు దారి తీసింది.
ఆయన ఇంకా బ్రతికి ఉండగానే.. వాజ్ పేయి ఇక లేరు అంటూ త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ ట్వీట్ చేశారు. వెంటనే ఆ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో.. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.
దీంతో నాలిక్కరుచుకున్న ఆయన వెంటనే సదరు ట్వీట్ను తొలగించి క్షమాపణ చెప్పారు. ‘‘క్షమించండి. ఓ ఆలిండియా టీవీ చానెల్లో వచ్చిన వార్తలను చూసి నేను అలా ట్వీట్ చేశాను. ముందు అది నిజమా కాదా అనేది తెలుసుకుని ఉండాల్సింది. వాజ్పేయిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నా ట్వీట్ను డిలీట్ చేశాను. మరోసారి క్షమించాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు.
కాగా వాజ్పేయి ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉందనీ... వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.