భారత్ రావాలంటే.. చైనా సహా ఈ ఐదు దేశాల నుంచి వచ్చేవారు ముందే కోవిడ్-19 పరీక్షలు చేయించుకోలి : కేంద్రం
New Delhi: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్ లాండ్ నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కడానికి ముందే తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Coronavirus disease-RT PCR Tests: పలు దేశాల్లో ప్రస్తుం కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయా దేశాల నుంచి భారత్ కు వచ్చేవారికి కరోనా వైరస్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్ లాండ్ నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు ముందుగానే తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
"2023 జనవరి 1 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు RT-PCR పరీక్ష తప్పనిసరి. ప్రయాణానికి ముందు వారు తమ నివేదికలను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది" అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంతకుముందు, చైనా, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్లాండ్ల నుండి వచ్చే ప్రయాణికులు భారతదేశానికి వచ్చినప్పుడు కోవిడ్ -19 పరీక్షలో నెగెటివ్ అని రుజువును చూపించాలనీ, వారు పాజిటివ్ అని పరీక్షిస్తే ఐసోలేషన్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనలు తీసుకువచ్చింది.
దేశంలో మూడు వేలకు పైగా కరోనా వైరస్ యాక్టివ్ కేసులు
భారత్ కరోనా వైరస్ కొత్త కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే, ఇతర దేశాల్లో కోవిడ్-19 ఉద్ధృతికి కారణమైన వేరియంట్లు భారత్ లోనూ వెలుగుచూడటంతో అప్రమత్తమైంది. కోవిడ్ నివారణ చర్యలు ప్రారంభించింది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 268 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్-19 క్రియాశీల కేసులు 3,552 కు పెరిగాయి. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,77,915)కు చేరుకుంది. మరణాల సంఖ్య 5,30,698కి చేరుకుంది. కొత్తగా కరోనా వైరస్ తో ఇద్దరు కేరళలో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఒకరు కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.11 శాతంగా నమోదైందనీ, వారాంతపు కోవిడ్-19 సానుకూలత రేటు 0.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.