ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం.. తృణమూల్ కాంగ్రెస్ రియాక్షన్ ఇదే
ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు. అసలైన విగ్రహం ఏర్పాటు చేసే వరకు హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా తాను స్వయంగా ప్రారంభిస్తానని మోడీ తెలిపారు. ఈ ప్రకటనపై టీఎంసీ రియాక్ట్ అయింది. ఇప్పటికే నేతాజీపై రూపొందించిన శకటం వివాదం కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: నేతాజీ(Netaji) థీమ్తో రూపొందించిన శకటంపై కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. నేతాజీ థీమ్తో రూపొందించిన తమ శకటాన్ని(tableau) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడానికి ఎంపిక చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ ప్రభుత్వం విమర్శలు చేసింది. నేతాజీ 125వ జయంతి యేటా జరుగుతున్న గణతంత్ర వేడుకల్లో(Republic Day Celebrations) ఆయన థీమ్తో ఉన్న శకటాన్ని పరేడ్లోకి ఎంపిక చేయకపోవడం బాధాకరం అని పేర్కొంది. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. శకటాల ఎంపికకు ప్రత్యక వ్యవస్థ ఉన్నది. అది పారదర్శకంగా శకటాలను ఎంపిక చేస్తుందని వివరణ ఇచ్చింది. అయినా.. ఆ వివాదం సద్దుమణగలేదు. తాజాగా, నేతాజీ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇండియా గేట్(India Gate) వద్ద నేతాజీ విగ్రహాన్ని(Netaji Statue) ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటనపై పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్(TMC) స్పందించింది.
టీఎంసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ కునాల్ గోష్ రియాక్ట్ అయ్యారు. నేతాజీపై రూపొందించిన పశ్చిమ బెంగాల్ శకటాన్ని కేంద్రం తిరస్కరించడం వివాదాస్పదం అయిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలని కేంద్రం భావిస్తున్నదని, అందులో భాగంగానే ఈ నూతన ప్రకటన అని వివరించారు. ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అయితే, అదే సమయంలో నేతాజీ అదృశ్యం కావడం వెనుక ఉన్న రహస్యాలను బట్టబయలు చేయడమే ఆయనకు మనమంతా అర్పించే అసలైన నివాళి అని తాము భావిస్తున్నట్టు తెలిపారు.
ఇదే తరహాలోనే టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అదే సమయంలో గణతంత్ర దినోత్సవ వేడుక పరేడ్లో నేతాజీపై రూపొందించిన శకటాన్ని అనుమతించడంలోనూ మునిగిపోయేదేమీ లేదని భావిస్తున్నామని చెప్పారు. సంకుచిత మనస్తత్వ రాజకీయాల వల్లే తమ శకటాన్ని అడ్డుకున్నారని పేర్కొన్నారు. మన దేశ సమరయోధులను గౌరవించడంలో బీజేపీ విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు నేతాజీ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించిందని వివరించారు.
ఇండియా గేట్ వద్ద నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు హోలోగ్రామ్ విగ్రహం ఉంటుందని ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని కూడా జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా తాను స్వయంగా ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు.
ప్రతీ ఏడాది 26న గణతంత్ర వేడుకలు జరుగుతాయి.. కానీ ఈ ఏడాది.. జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. జవనరి 24న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను కూడా గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది నుంచి ప్రతి యేడాది జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించనున్నారు.