38 కిలోమీటర్ల దూరం.. నాలుగు గంటల పాటు సైకిల్ తొక్కి, అసెంబ్లీకి చేరిన మంత్రి
దేశంలో రోజు రోజుకు చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల సెంచరీ మార్క్ను దాటేసి కొత్త రికార్డులు సృష్టించేందుకు దూసుకెళ్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
దేశంలో రోజు రోజుకు చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల సెంచరీ మార్క్ను దాటేసి కొత్త రికార్డులు సృష్టించేందుకు దూసుకెళ్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదే సమయంలో పలువురు నేతలు వినూత్నంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మంత్రి తమ ఇంటి నుంచి అసెంబ్లీకి 38 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లారు. ఆయనకు మద్దతుగా కొందరు పార్టీ కార్యకర్తలు కూడా మంత్రితో కలిసి సైకిళ్లపై ర్యాలీగా అనుసరించారు.
Also Read:పెట్రోల్ ధరల పెంపుపై నిరసన: 20 రోజుల తర్వాత హైద్రాబాద్ పోలీసుల కేసు, ఎందుకో తెలుసా?
వివరాల్లోకి వెళితే.. సింగూర్ నియోజకవర్గ టీఎంసీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక మంత్రి బెచారాం మన్నా నేడు సైకిల్పై అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. హూగ్లీలోని తన నివాసం నుంచి ఈ ఉదయం 8 గంటలకు సైకిల్పై బయల్దేరిన ఆయన మధ్యాహ్నం 12.30 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ వైఫల్యానికి తాజా నిదర్శనమే.. దేశంలో ఇంధన ధరల పెరుగుదలగా ఆయన మీడియాతో అన్నారు. కోల్కతాలో పెట్రోల్ ధర సెంచరీ దాటిందని.. దీనికి నిరసనగానే తాము ఈ సైకిల్ ర్యాలీ చేపట్టామని మంత్రి బెచారం తెలిపారు. కాగా, పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 10, 11వ తేదీల్లో బెంగాల్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అధికార తృణమూల్ కాంగ్రెస్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.