కర్ణాటకలో మహిళల డెడ్ బాడీలు డ్రమ్‌లలో కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెల నుంచి మూడు డెడ్ బాడీలు ఇలాగే కనిపించాయి. ఇవి సీరియల్ కిల్లింగ్‌లే అని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా పోలీసులు ఈ ఆరోపణలు ఖండించారు. సోమవారం బయ్యప్పనహల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ డ్రమ్‌లో మహిళ మృతదేహం కనిపించింది. తాజా కేసుతో గతంలోని ఘటనలకు సంబంధం లేదని వివరించారు. 

బెంగళూరు: కర్ణాటకలో మహిళల మృతదేహాలు డ్రమ్‌లలో లభించడం ఇప్పుడు కలకలం రేపుతున్నది. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళల మృతదేహాలు వేర్వేరు ప్రాంతాల్లో డ్రమ్‌లలో కనిపించాయి. దీంతో ఇవి సీరియల్ కిల్లింగ్స్ అంటూ కాంగ్రెస్ పేర్కొంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. 

డిసెంబర్ నెల నుంచి మూడు డ్రమ్‌లలో ముగ్గురు మహిళల మృతదేహాలు లభించాయి. తాజా కేసులో బెంగళూరులోని బయ్యప్పనహల్లి రైల్వే స్టేషన్‌ ఓ ఎంట్రీ గేట్ సమీపంలో ఒక డ్రమ్ ఉన్నది. ఆ డ్రమ్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల ప్రాంతంలో ఓ మహిళ డెడ్ బాడీ ఉన్నది. ఆ డ్రమ్‌లో వస్త్రాలతో కుక్కి మూత వేసి ఉన్నది.

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు. ఈ మర్డర్‌ను తాము సాల్వ్ చేశామని వివరించారు. గతంలో డ్రమ్‌లలో మహిళల డెడ్ బాడీలు లభించిన కేసులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మృతురాలిని 27 ఏళ్ల తమన్నా అని పోలీసులు తెలిపారు. ఆమెను బావ/మరిది చంపేశాడని వివరించారు. బిహార్ అరేరియాలోనే తన భర్తను వదిలి బంధువైన ఇంతెకాబ్‌తో తమన్నా పారిపోయి బెంగళూరుకు వచ్చిందని చెప్పారు. ఆ జంట బెంగళూరులో నివసించిందని వివరించారు. అఫ్రోజ్ సోదరుడు కమల్, ఆయన మిత్రుల సహకారంతో ఫిబ్రవరి 12వ తేదీన తమన్నాను చంపేశాడని తెలిపారు. మరుసటి రోజు రైల్వే స్టేషన్ సమీపంలో డ్రమ్‌లో తమన్నా డెడ్ బాడీని వదిలిపెట్టి వెళ్లారని, వారు వెళ్లిన ఆటోరిక్షాను సెక్యూరిటీ ఫుటేజీ సహాయంతో ట్రాక్ చేశామని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఐదుగురు మిస్ అయ్యారని పేర్కొన్నారు.

Also Read: 15 ఏళ్ల మనవరాలిని రేప్ చేసిన వృద్ధుడు.. చేతిలో రూ. 10 నోటు పెట్టి బుజ్జగింపు.. అరెస్టు

ఇలాంటి తొలి ఘటన డిసెంబర్ 6వ తేదీన చోటుచేసుకుంది. ట్రైన్‌లో ఓ డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. బెంగళూరులోని యశ్వంత్‌పుర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ డ్రమ్‌లో జనవరి 4వ తేదీన పలు గాయాలతో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించింది. ఈ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. గతంలోని హత్యలతో తాజా కేసుకు సంబంధం లేదని పోలీసులు వివరించారు. ఇందులో సీరియల్ కిల్లర్ పాత్ర లేదని తెలిపారు.

కాంగ్రెస్ లీడర్ రణదీప్ సుర్జేవాలా దీనిపై ట్వీట్ చేశారు. రైల్వే స్టేషన్‌ల సమీపంలో ముగ్గురు మహిళల మృతదేహాలు డ్రమ్‌లలో కనిపించాయని, ఆ డేట్లను గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, సీరియల్ కిల్లింగ్స్ చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.