తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె దాటుతుండగా మూడు ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మరణించాయి

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె దాటుతుండగా మూడు ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మరణించాయి. వివరాలు.. ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కాళీ కవుందర్ కొట్టాయ్ గ్రామంలో ఓ రైతు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. అయితే రాత్రి వేళలో అటుగా వచ్చిన మూడు ఏనుగులు విద్యుత్ కంచె‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాయి.

ఈ క్రమంలోనే మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే రెండు ఏనుగు పిల్లలు విద్యుత్ కంచెకు దూరంగా ఉండటంతో సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధిచి స్థానికులు విద్యుత్, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. పొలం యజమాని కె మురుగన్ అక్రమంగా విద్యుత్‌ కంచె వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మురుగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.