పోలీసుల చేతిలో ఓ యువకుడు చిత్రహింసలకు గురయ్యాడు. శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో చివరికి హాస్పిటల్ పాలయ్యాడు.ఈ ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది యూపీలో చోటు చేసుకుంది.
పశువుల దొంగతనం కేసులో ఓ యువకుడిని స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసుల.. అతడిని చిత్ర హింసలకు గురి చేశారు. దారుణంగా చితకబాది, కరెంట్ షాక్ పెట్టారు. దీంతో అతడు తీవ్రంగా గాయాలపాలై హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన యూపీలో సంచలనం సృష్టించింది. ఇది వెలుగులోకి రావడంతో స్టేషన్ ఇన్ఛార్జ్తో సహా ఐదుగురు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
దినసరి కూలీ పని చేసే 20 ఏళ్ల రెహాన్ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పశువుల స్మగ్లర్ల బృందానికి సహాయం చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతడిని స్టేషన్ కు తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
రెహాన్ తీవ్రంగా గాయపడి నడవలేక, మాట్లాడలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కరెంటు షాక్లు ఇవ్వడంతో పాటు కర్రతో తీవ్రంగా కొట్టారని దీంతో అతడి ప్రైవేట్ భాగాలకు గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి రూ.5 వేలు లంచం తీసుకొని విడిచిపెట్టారని ఆరోపించారు. పైగా చికిత్స కోసం పోలీసులు రూ.100 నోటు ఇచ్చారని కుటుంబీకులు తెలిపారు.
రాజస్థాన్ లో దారుణం.. కదులుతున్న రైలు కింద దూకిన యువతీ యువకుడు
కొన్ని గంటల పాటు రెహాన్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడని, చివరికి లంచం ఇస్తేనే విడుదల చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం రెహాన్ ప్రస్తుతం బులంద్షహర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి, ఆపై జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, అందులో పేర్కొన్న ఐదుగురు పోలీసులను ఇప్పటి వరకు సస్పెండ్ చేశారు. ఈ విషయంపై అంతర్గత దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సీనియర్ సిటీ పోలీసు అధికారి ప్రవీణ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
Uttarakhand Bus Accident : బస్సు లోయలో పడిన ఘటనలో 25కి చేరిన మృతుల సంఖ్య..
కాగా ఇలాంటి ఘటనే ఇటీవల అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ దినసరి కూలీని పోలీసులు తీసుకెళ్లి పోలీసు స్టేషన్ లో ఉంచారు. అయితే మరుసటి రోజు కుటుంబ సభ్యులు అతడి కోసం వెళ్తే హాస్పిటల్ జాయిన్ చేశామని, అక్కడికి వెళ్లి అతడిని చూసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో హాస్పిటల్ కు వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు అతడి పరిస్థితి చూసి ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు చేరుకొని సిబ్బందిపై దాడి చేశారు. అదే కోపంలో పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ ఘటన కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
