మధ్యప్రదేశ్ లో నర్మదా నదిపై నడిచిన మహిళ.. దేవత అంటూ పూజించిన ప్రజలు.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్ లో ఓ మహిళ నర్మదా నదిపై నడిచింది. దీంతో ఆమెను స్థానికులందరూ దేవతా అంటూ పూజించడం మొదలుపెట్టారు. ఆమె చుట్టూ తిరుగుతూ డప్పులు వాయించారు. కాగా.. ఆమె నదిపై నడిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.
‘తిల్వారా ఘాట్ వద్ద నర్మదా నీటి ఉపరితలంపై నడుస్తున్న మహిళ’ అనే క్యాప్షన్ తో ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ గా మారడంతో ఆమెను చూసేందుకు స్థానికులు నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ మహిళ నదీ జలాల నడించిందని, ప్రజలు ఆమెను నర్మదా మాత రూపం అని కీర్తించారు. దేవత అంటూ పూజించారు.
ఆ మహిళ చుట్టు జనం చేరి డప్పులు వాయించారు. దీంతో ఆమెను చూసేందుకు మరింత మంది రావడం మొదలుపెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటా హుటిన అక్కడికి తరలివచ్చారు. నర్మదా నది ఒడ్డుకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి రక్షణ కల్పించారు.
ఆ మహిళ నిజంగానే నర్మదా నదిపై నడిచిందా?
నర్మదా నదీ జలాల్లో నడిచిందని చెబుతున్న మహిళను జ్యోతి రఘువంశీ గా గుర్తించారు. అయితే తాను దేవతను కాదని, ఓ సామాన్యురాలినని ఆమె చెప్పారు. తాను నర్మదాపురన్ ప్రాంతానికి చెందిన మహిళను అని, 10 నెలల కిందట ఇంటి నుంచి పారిపోయానని ఆమె పోలీసులకు తెలిపారు.
వీడిన మిస్టరీ..
ఆ మహిళ నర్మదా నదిపై నడవడం వెనుక ఉన్న మిస్టరీని వెల్లడైంది. నది నీటి మట్టం చాలా చోట్ల మారుతూ ఉంది. కొన్ని చోట్ల చాలా తక్కువగా కూడా ఉంది. అలాంటి ప్రదేశంలోనే జ్యోతి రఘువంశీ నడిచారు. అయితే ఆ పోస్టు క్యాప్షన్ లో పేర్కొన్నట్టు ఆ వీడియోను తిల్వారా ఘాట్ వద్ద తీయలేదు. ఆమె నదీతీరంలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె స్వతహాగా భక్తురాలు కాబట్టి.. ఆ వీడియో తీసిన రోజు ఆ మహిళ అక్కడికి నర్మదా నదిని ప్రదక్షిణ చేసేందుకు వచ్చారు. అయితే అప్పుడు కూడా జ్యోతి నది ఒడ్డునే నడిచింది. నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఆమె నదీ లోపలి వరకు వెళ్లింది. అయితే దీనినే దూరం నుంచి పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. జ్యోతి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఆమెను ఇంటికి పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.